Malaysia Open | మలేషియా ఓపెన్లో తొలి రౌండ్లోనే భారత ఏస్ షట్లరు ఇద్దరు ఇంటిముఖం పట్టారు. మలేషియా ఓపెన్ టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. సింగిల్స్ తొలి రౌండ్లోనే భారత్కు చెందిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. చైనా క్రీడాకారిణి చేతిలో సైనా.. జపాన్ ఆటగాడి చేతిలో శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు.
రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన సైనా నెహ్వాల్ ఏడాది కాలంగా గాయాలు, ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నది. ఇవాల్టి నుంచి ప్రారంభమైన మలేషియన్ ఓపెన్ మహిళల సింగిల్స్లో చైనాకు చెందిన హాన్ యుయె చేతిలో 12-21, 21-17, 12-21 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమిచెందింది. తొలి రౌండ్ మ్యాచ్లో నిర్ణయాత్మకంగా పోరాడిన సైనా రెండో గేమ్లో గెలిచి మంచి ఊపుమీదికొచ్చింది. అయితే, మూడో గేమ్ను హాన్ పుంజుకుని సైనాకు అవకాశమివ్వకుండా విజయం సాధించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఓటమిచెందాడు. ఇటీవల ఫామ్ కోసం తంటాలు పడుతున్న శ్రీకాంత్కు.. జపాన్కు చెందిన అన్సీడెడ్ కెంటా నిషిమోటో 42 నిమిషాల్లో 19-21, 14-21 తేడాతో షాకిచ్చాడు. రెండో గేమ్లో ఇద్దరు 12-12 తో సమ ఉజ్జీలుగా నిలిచారు. శ్రీకాంత్ పుంజుకుని తన గేమ్ లాగేసుకోకుండా కెంటా శక్తినంతా ఉపయోగించి షాట్లు కొట్టాడు. చివరకు 21 పాయింట్లు సాధించి కెంటా గెలిచాడు. మరో సింగిల్స్లో చైనీస్ తైపీకి చెందిన వెన్ చి హ్సు చేతిలో 10-21, 8-21 తేడాతో ఆకర్షి కశ్యప్ చిత్తయ్యాడు. పురుషుల డబుల్స్ జోడీ కృష్ణ గరగ-విష్ణువర్ధన్ పంజాల కూడా 10-21, 18-21 తో దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్-సియో సియుంగ్ జే చేతిలో ఓడారు.