హైదరాబాద్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా తుది జట్టు ఎంపిక తీరుపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) మండిపడ్డారు. తుది జట్టు కోసం అశ్విన్ను ఎంపిక చేయకపోవడం పట్ల సచిన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అత్యుత్తమ స్పిన్నర్కు అనుకూలమైన పిచ్తో సంబంధంలేదని సచిన్ అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా 209 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
ఫైనల్ జట్టుకు అశ్విన్(Ashwin)ను ఎందుకు ఎంపిక చేయలేదన్న విమర్శలపై కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ.. స్పీడ్ బౌలింగ్కు ఓవల్ పిచ్ అనుకూలంగా ఉంటుందన్న నేపథ్యంలో అదనంగా నాలుగో బౌలర్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అశ్విన్ను ఎంపిక చేయకపోవడాన్ని ద్రావిడ్ సమర్ధించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉందని, కానీ రోహిత్ సేన ఆడలేకపోయినట్లు సచిన్ తన ట్వీట్లో తెలిపారు. టీమిండియాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చాయి, కానీ తుది జట్టు నుంచి అశ్విన్ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదని సచిన్ అన్నారు. అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ అని సచిన్ తెలిపారు.
నైపుణ్యం ఉన్న స్పిన్నర్లకు పిచ్ పరిస్థితితో సంబంధం లేదని, గాలిలో ఉన్న గమనాన్ని, పిచ్ సర్ఫేస్లో ఉన్న బౌన్స్ ఆధారంగా బౌల్ చేస్తుంటారని, ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్లో 5 మంది ఎడమ చేతి బ్యాటర్లు ఉన్నారని, డబ్ల్యూటీసీ టోర్నీలో అశ్విన్ 13 టెస్టుల్లో 61 వికెట్లు తీశాడని సచిన్ గుర్తు చేశారు.
Congratulations to Team Australia on winning the #WTCFinal. @stevesmith49 and @travishead34 set a solid foundation on Day one itself to tilt the game in their favour. India had to bat big in the first innings to stay in the game, but they couldn’t. There were some good moments…
— Sachin Tendulkar (@sachin_rt) June 11, 2023