సౌతాఫ్రికా చేతిలో 220 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్ జట్టు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్ మితిమీరిందని, అయినా సరే అంపైర్లు దీన్ని పట్టించుకోలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆరోపణలు చేస్తోంది. ‘‘మా ఆటగాడు మహ్మదుల్ హసన్ బ్యాటింగ్ చేయడానికి వెళ్లినప్పుడు.. సౌతాఫ్రికా ఆటగాళ్లు అతన్ని చుట్టుముట్టి స్లెడ్జింగ్ మొదలు పెట్టారు.
అతని జూనియర్ ఆటగాడు కావడంతో ఎదురు సమాధానం చెప్పలేకపోయాడు. వాళ్ల స్లెడ్జింగ్ భరించలేనంత దూరం వెళ్లడంతో అంపైర్లకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లు కూడా మా ఆటగాళ్లనే తప్పుబట్టారు’’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చీఫ్ జలాల్ యూనుస్ చెప్పాడు. బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ కూడా.. మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాళ్ల స్లెడ్జింగ్ విపరీతంగా ఉందని, అంపైర్లు దాన్ని అసలు పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇలాంటి మ్యాచుల్లో న్యూట్రల్గా ఉండే అంపైర్లను ఐసీసీ నియమించాలని సూచించాడు. వన్డే సిరీస్ ముగిసినపప్పుడు అంపైర్లపై టీం మేనేజర్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడని, ఇప్పుడు టెస్టు గురించి కూడా ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని యూనుస్ ప్రకటించారు.