ఈనెల 27 నుంచి యూకే వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీలో పాల్గొనేందుకు గాను రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి నటెల జలామిడ్జ్ (Natela Dzalamidze) .. ఏకంగా తన దేశ పౌరసత్వాన్నే వద్దనుకుంది. 29 ఏండ్ల నటెల.. వింబూల్డన్ లో ఆడేందుకు గాను రష్యా పౌరసత్వాన్ని వదులకుని జార్జియా తరఫున పోటీలోకి దిగుతున్నది.
‘ది టైమ్స్ న్యూస్ పేపర్’ లో వచ్చిన కథనం మేరకు.. డబుల్స్ లో ప్రపంచ 44 వ ర్యాంకర్ అయిన జలామిడ్జ్ ఈసారి వింబూల్డన్ లో పాల్గొనేందుకు జార్జియా నుంచి ఆడబోతున్నది. రష్యా టెన్నిస్ క్రీడాకారులెవరూ ఆ దేశ జెండా మీద వింబూల్డన్ లో ఆడేందుకు తాము అనుమతించబోమని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ఈ ఏడాది ఏప్రిల్ లో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో వింబూల్డన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. రష్యా తో పాటు బెలారస్ కు చెందిన ఆటగాళ్లు కూడా వింబూల్డన్ లో ఆడేందుకు అనుమతి లేదని.. వాళ్లు స్వతంత్రంగా ఆడితే తమకేమీ అభ్యంతరం లేదని గతంలోనే తెలిపింది. దేశాన్ని కాదని ఒకవేళ స్వతంత్రంగా బరిలోకి దిగితే స్వదేశంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులు భావిస్తున్నారు.
నటెల.. కొన్నాళ్లుగా అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా) తో కలిసి డబుల్స్ లో ఆడుతున్నది. ఇప్పుడు ఆమె జార్జియా తరఫున ఆడతానని అభ్యర్థించిన నేపథ్యంలో ఆమెను వింబూల్డన్ లో ఆడనిస్తారా..? అన్న ప్రశ్నకు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ స్పందిస్తూ.. ‘అది మా చేతుల్లో లేదు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తీసుకునే నిర్ణయంపై అది ఆధారపడి ఉంది’ అని తెలిపింది.
Georgia nationality switch allows Russia-born Natela Dzalamidze to play 2022 Wimbledon#WTA #Wimbledon pic.twitter.com/gVLiJqTyhe
— Tennis Tracker (@TrackerTennis) June 20, 2022