సకల సౌకర్యాలతో అభివృద్ధి పథంలో గ్రామం
కొత్త జీపీ ఏర్పాటుతో తీరిన సమస్యలు
మండలంలోనే మొదటి ఓడీఎఫ్ విలేజ్
సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ, ప్రజల భాగస్వామ్యం
అందరి సహకారంతో ఆదర్శంగా పల్లె
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని అజ్మీరతండా కొత్తశోభ సంతరించుకుంది. గతంలో పెద్దనాగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలను జీపీగా మార్చడంతో అజ్మీరతండాకు మహర్దశ వచ్చింది. ప్రత్యేక పంచాయతీగా ఏర్పడడం, నెలనెలా సర్కారు నుంచి నిధులు సమకూరుతుండడంతో అభివృద్ధి బాట పట్టింది. ఈ జీపీ పరిధిలో బుడ్డతండా, గోల్లబంజర, వాంకుడోతుతండా, ఎర్రకుంట తండాలు ఉన్నాయి. మొత్తం ఐదు తండాలు కలుపుకొని 900 జనాభా ఉంది. 250 గృహాలు, 670 ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా యువకులు ఉండడం వల్ల ఉన్నత చదువులు చదివిన యువ సర్పంచ్గా బానోతు నిర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ గ్రామాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పంచాయతీ పరిధిలోని 250 ఇండ్లలో ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు, ఇంకుడుగుంతలు సైతం పూర్తి చేశారు.
పల్లె ప్రగతితో కొత్తరూపు
పల్లె ప్రగతితో తండా కొత్తరూపు సంతరించుకుంది. గ్రామానికి అంతర్గత రోడ్డు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు పంచాయతీ ట్రాక్టర్తో నీరు అందిస్తున్నారు. గతంలో తండాల్లో ఎక్కడచూసినా మురుగునీరు కనిపించేది. మరుగుదొడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల ఆవశ్యకతపై అవగాహన కల్పించడంతో ఇప్పుడు ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించారు. ఫలితంగా మండలంలోనే మొదటి ఓడీఎఫ్ గ్రామంగా అజ్మీరతండాకు గుర్తింపు వచ్చింది. అలాగే ఇంకు డు గుంతల నిర్మాణాలు తుదిదశకు వచ్చాయి. రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా ప్రజల్లో చైత న్యం తీసుకొచ్చారు. ట్రాక్టర్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తండాల్లోకి వెళ్లే రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు.