న్యూఢిల్లీ: కరోనా వైరస్తో అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ కన్నవారిని కోల్పోగా, తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆర్పీసింగ్ తండ్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కొవిడ్-19తో పోరాడిన శివప్రసాద్ సింగ్ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆర్పీసింగ్ ట్విట్టర్ ద్వారా తెలియపరిచాడు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఈ క్లిష్ట సమయంలో ఆ దేవుడు తమ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. మరోవైపు భారత మాజీ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, అర్జున అవార్డీ చంద్రశేఖర్(64) కరోనా వైరస్తో మృతి చెందారు. మూడు సార్లు జాతీయ టీటీ చాంపియన్ అయిన చంద్రశేఖర్కు భార్య, కొడుకు ఉన్నారు.