ముంబై: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదరగొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై అద్భుత విజయం సాధించింది. ప్రముఖ సింగర్ ఆశా భోంస్లేకు ఘన నివాళులు అర్పించిన ఇరు జట్ల ప్లేయర్లు నల్లరిబ్బన్లు ధరించి మ్యాచ్ బరిలో దిగారు. టాస్ గెలిచిన ముంబై..ఆర్సీబీని బ్యాటింగ్కు ఆహ్వానించింది.
వరుస మ్యాచ్ల్లో విఫలమవుతున్న ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 78, 6ఫోర్లు, 6సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 50, 5ఫోర్లు, సిక్స్), రజత్ పటిదార్(20 బంతుల్లో 53, 4ఫోర్లు, 5సిక్స్లు) అర్ధసెంచరీలతో ఆర్సీబీ 20 ఓవర్లలో 240/4 స్కోరు చేసింది. ముంబైపై ముంబైలో ఆర్సీబీకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 222/5 స్కోరు చేసింది. రూథర్ఫర్డ్(31 బంతుల్లో 71 నాటౌట్, ఫోర్, 9సిక్స్లు)ఒంటరిపోరాటం చేశాడు.
బౌల్ట్ బౌలింగ్లో డీప్ స్వేర్ లెగ్లో కోహ్లీ కండ్లు చెదిరే రీతిలో సిక్స్తో ఖాతా తెరువగా, తానేం తక్కువ కాదన్నట్లు సాల్ట్ కూడా జత కలువడంతో పరుగుల వరద మొదలైంది. ముఖ్యంగా సాంట్నర్ వేసిన ఐదో ఓవర్లో సాల్ట్ హ్యాట్రిక్ సిక్స్లకు తోడు ఫోర్తో 22 పరుగులు పిండుకున్నాడు. ఇక లాభం లేదనుకుని బుమ్రాను దించగా ఆరు పరుగులు వచ్చినా పవర్ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది.
బౌలింగ్ మార్పుగా వచ్చిన మయాంక్ను హ్యాట్రిక్ ఫోర్లకు తోడు సిక్స్తో సాల్ట్ మరోమారు చెలరేగి 25 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దుల్ విడదీయడంతో తొలి వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. సాల్ట్ ఔటైనా..కోహ్లీ, పటిదార్ అదే దూకుడు కొనసాగించారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు బౌండరీలు బాదడంతో వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది.
భారీ లక్ష్యఛేదనలో ముంబైకి రోహిత్శర్మ(19) రిటైర్డ్హార్ట్ రూపంలోఎదురుదెబ్బ తగిలింది.మిడిలార్డర్లో సూర్యకుమార్(33), హార్దిక్(40) ఆకట్టుకున్నా.. లాభం లేకపోయింది. ఆఖర్లో రూథర్ఫర్డ్..ఆర్సీబీ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఏకంగా తొమ్మిది సిక్స్లతో విరుచుకుపడ్డాడు. సహచరుల సహకారం లేకపోయినా రూథర్ఫర్డ్ పోరాటం ఆకట్టుకుంది.
బెంగళూరు: 20 ఓవర్లలో 240/ 4(సాల్ట్ 78, పటిదార్ 53, శార్దుల్ 1/32, హార్దిక్ 1/39),
ముంబై: 20 ఓవర్లలో 222/5(రూథర్ఫర్డ్ 71 నాటౌట్, హార్దిక్ 40, సుయాశ్ 2/47, రసిక్ 1/23).
