రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అద్భుతం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ లో స్కోరింగ్ మ్యాచ్లో ముంబైని ఆర్సీబీ మట్టికరిపించింది. ఎలీస్ పెర్రీ అర్ధసెంచరీతో పోరాడే స్కోరు అందుకున్న బెంగళూరు..బౌలింగ్లోనూ భళా అనిపించింది. ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.
WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. లీగ్ దశలో తడబడి నిలబడ్డ ఆర్సీబీ..ముంబైతో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో జూలు విదిల్చింది. శుక్రవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 పరుగుల తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత ఎలీస్ పెర్రీ (50 బంతుల్లో 66, 8ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 135/6 స్కోరు చేసింది. ఓపెనర్లు మందన(10), సోఫీ డివైన్ (10) నిరాశపరిచారు. మాథ్యూస్, బ్రంట్, ఇషాక్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లలో 130/6 స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్(33) టాప్ స్కోరర్గా నిలిచింది. శ్రేయాంక పాటిల్ (2/16) రెండు వికెట్లు తీయగా, పెర్రీ, మిలోనెక్స్, వేర్హామ్, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఆదివారం జరిగే లీగ్ ఫైనల్లో ఢిల్లీ, ఆర్సీబీ తలపడుతాయి.
ముంబై చేజేతులా : స్వల్ప లక్ష్యఛేదనలో ముంబైకి సరైన శుభారంభం దక్కలేదు. యస్తికా భాటియా(19), మాథ్యూస్(15) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 27 పరుగులకే ముంబై.. మాథ్యూస్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 23 పరుగులకే భాటియా ఔట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. ఆదుకుంటుందనుకున్న స్కీవర్(23) కూడా నిరాశపరిచింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ (33) ..కెర్(్ర27 నాటౌట్)తో కలిసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసింది. అయితే 24 బంతుల్లో 32 పరుగులు అవసరమైన దశలో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇదే అదనుగా పట్టు బిగించిన ఆర్సీబీ అనుకున్న ఫలితం రాబట్టింది.
బెంగళూరు: 20 ఓవర్లలో 135/6(పెర్రీ 66, వేర్హామ్ 18 నాటౌట్, మాథ్యూస్ 2/18, బ్రంట్ 2/18),
ముంబై: 20 ఓవర్లలో 130/6(కౌర్ 33, కెర్ 27 నాటౌట్, పాటిల్ 2/16, మిలెనోక్స్ 1/16)