టెస్టు సిరీస్లో దుమ్మురేపి.. పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థిని చిత్తుచేసి ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా.. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్తో వన్డే సమరానికి సమాయత్తమవుతున్నది. బ్యాటింగ్కు స్వర్గధామమైనపుణె పిచ్పై కోహ్లీ సేన కదంతొక్కుతుందా.. మోర్గాన్ గ్యాంగ్ మోత మోగిస్తుందా చూడాలి!
పుణె: వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న భారత జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎమ్సీఏ) స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా జరుగనున్న తొలి వన్డేలో ఇంగ్లండ్తో తలపడనుంది. టెస్టు సిరీస్లో భాగంగా చివరి రెండు టెస్టులతో పాటు, ఐదు టీ20లను అహ్మదాబాద్లోనే ఆడిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్లోని మూడు మ్యాచ్లను ఇదే మైదానంలో ఆడనుంది. తొలి వన్డేకు ముందు యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఓపెనర్ శిఖర్ ధావన్పైనే అందరి దృష్టి నెలకొంది. మరోవైపు వరుస ఓటములతో డీలాపడ్డ ఇంగ్లండ్.. తిరిగి పుంజుకొని వన్డే సిరీస్ చేజిక్కించుకోవాలిన కృతనిశ్చయంతో ఉంది.
ధావన్కు లాస్ట్ చాన్స్!
పృథ్వీ షా, శుభ్మన్ గిల్లాంటి యువ ఆటగాళ్లు ఓపెనింగ్ స్థానంపై కన్నేయడంతో ధావన్ కెరీర్కు ఈ సిరీస్ కీలకం కానుంది. టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన 35 ఏండ్ల ధావన్ ఈ ఫార్మాట్లో సత్తాచాటకపోతే ఇకపై జట్టులో చోటు దక్కడం కష్టమే. మ్యాచ్కు ఒక రోజు ముందే రోహిత్, ధావన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని కోహ్లీ స్పష్టం చేయగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీలకం కానున్నారు. లోకేశ్ రాహుల్కు మిడిలార్డర్లోనైనా చోటు దక్కుతుందా చూడాలి. పాండ్యా పూర్తి కోటా వేస్తాడని భావిస్తే.. రాహుల్కు చాన్స్ ఉంది. లేకపోతే వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యాల్లో ఒకరికి పిలుపు రానుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా గైర్హాజరీలో భువనేశ్వర్ పేస్ దళానికి నాయకత్వం వహించనుండగా.. అతడితో పాటు శార్దూల్ ఠాకూర్, నటరాజన్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. తొలిసారి జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణతో పాటు హైదరాబాదీ పేసర్ సిరాజ్కు తుది జట్టులో చోటు దక్కేది అనుమానమే.
బ్యాటింగే బలం
టెస్టు సిరీస్లో పెద్దగా పోటీనివ్వలేకపోయిన ఇంగ్లండ్.. పొట్టి ఫార్మాట్లో సత్తాచాటింది. ఒకదశలో సిరీస్ చేజిక్కించుకునేలా కనిపించినా.. ఒత్తిడిని జయించడంలో విఫలమై పరాజయం వైపు నిలిచింది. అయితే ఆ ఓటములను పక్కనపెట్టి వన్డే సిరీస్ కోసం మోర్గాన్ సేన తాజాగా సిద్ధమవుతున్నది.
ఆ మ్యాచ్ గుర్తుందా..!
2017, జనవరి 15.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య పుణె వేదికగా తొలి వన్డే జరిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (73), జో రూట్ (78), బెన్ స్టోక్స్ (62) అర్ధశతకాలతో రాణించగా.. మిగిలినవాళ్లు కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లిష్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శిఖర్ ధావన్ (1), లోకేశ్ రాహుల్ (8), యువరాజ్ సింగ్ (15), మహేంద్రసింగ్ ధోనీ (6) విఫలమైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), కేదార్ జాదవ్ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో విజృంభించడంతో టీమ్ఇండియా 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లపై విరాట్ విరుచుకుపడి ఇన్నింగ్స్ను చక్కదిద్దితే.. లోకల్ బాయ్ కేదార్ జాదవ్ వీరవిహారంతో జట్టును గెలిపించడం విశేషం. అదే జోరులో రెండో వన్డే కూడా నెగ్గిన భారత్ సిరీస్ చేజిక్కించుకుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, శ్రేయస్, పంత్, రాహుల్/సుందర్, హార్దిక్, భువనేశ్వర్, శార్దూల్, చాహల్/కుల్దీప్, నటరాజన్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్స్టో, స్టోక్స్, బట్లర్, బిల్లింగ్స్, అలీ, సామ్ కరన్, రషీద్, టాప్లే, వుడ్.
పిచ్, వాతావరణం
పుణె పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. ఈ మైదానంలో ఇప్పటి వరకు నాలుగు వన్డేలు జరుగగా.. అందులో మూడుసార్లు మూడొందల పైచిలుకు పరుగుల లక్ష్యఛేదన సాధ్యమైంది. వర్ష సూచన లేదు.
అదో బ్రహ్మపదార్థం
డీఆర్ఎస్ లేని సమయంలో కూడా నేను మ్యాచ్లు ఆడాను. అంపైర్ ఒకసారి నిర్ణయం ప్రకటిస్తే.. ఆటగాళ్లకు ఇష్టం ఉన్నా లేకున్నా దానికి కట్టుబడేవాళ్లం. అంపైర్స్ కాల్ ప్రవేశపెట్టాక తికమక ఎక్కువైంది. అంపైర్ నిర్ణయంపై సమీక్ష తీసుకునే అవకాశం ఉన్నా.. 50 శాతానికి మించి బంతి వికెట్లను తాకుతుందని భావిస్తేనే ఔట్గా ప్రకటిస్తున్నారు. నా దృష్టిలో బంతి వికెట్లను తాకితే ఔటైనట్లే. అంతేకానీ 50 శాతానికి తక్కువ, ఎక్కువ అనే నిబంధనలేంటో అర్థం కావడంలేదు.