Rohit Sharma : టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడ్డప్పటి నుంచి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని అనుకుంటున్నారంతా. దాంతో, ముంబైలోని బీసీసీఐ ఆఫీసుకు ఫోన్లు వెల్లువెత్తున్నాయి. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న అతను పంత్కు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడాడు. రూర్కీ వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో రిషభ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు అతనికి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. స్కానింగ్లో మెదడు, వెన్నెముకకు గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.
బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో పంత్ 93 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. బంగ్లా సిరీస్ తర్వాత దుబాయ్ వెకేషన్లో మాజీ క్రికెటర్ ధోనీతో కలిసి క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో గాయపడడంతో అతను వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే శ్రీలంక, ఆసీస్ టూర్కు దూరమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు 2023లో ఐపీఎల్ సీజన్ మొదలుకానుంది. ఢిల్లీ క్యాపిట్స్ కెప్టెన్గా ఉన్న పంత్ ఈ సీజన్లో ఆడతాడా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. గాయంతో బంగ్లాతో రెండో టెస్టుకు దూరమైన రోహిత్ ప్రస్తుతం భార్య రితికాతో మాల్దీవుల టూర్లో ఉన్నాడు.