క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ముగిసింది. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు సారధి రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేయలేదు. ఇలాంటి సమయంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్లో రోహిత్కు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తప్పుబట్టాడు.
రోహిత్ శర్మ భారత జట్టు సారధి అని, అతనికి విశ్రాంతి ఇవ్వకుండా ఉండాల్సిందని అన్నాడు. అసలు రోహిత్కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపించడంలేదన్నాడు. ‘‘విశ్రాంతి తీసుకోవాలా? వద్దా? అనేది అతని వ్యక్తిగత అభిప్రాయమే. అతను ఎంత అలసిపోయాడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. కానీ నా అభిప్రాయం అడిగితే మాత్రం.. రోహిత్ ఈ సిరీస్ ఆడాల్సింది. ఇది సుదీర్ఘమైన సిరీస్. అంతేకాదు, భారత జట్టుకు రోహిత్ కెప్టెన్ కూడా’’ అని ఆర్పీ సింగ్ అన్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో రోహిత్ శర్మ చాలా పేలవమైన ప్రదర్శన చేశాడు. దీనిపై కూడా స్పందించిన ఆర్పీ సింగ్.. రోహిత్ దాదాపు మూడు, నాలుగు ఏళ్లుగా ఐపీఎల్లో పెద్దగా రాణించడం లేదని చెప్పాడు. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా కనీసం 400 పరుగులు చేయలేదని గుర్తుచేశాడు.