దుబాయ్: రానున్న టీ20 వరల్డ్కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ఇప్పటికే విరాట్ కోహ్లి ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అతని వారసుడు ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఈ రేసులో రోహిత్ శర్మ( Rohit Sharma ) ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా రోహిత్కే తన ఓటు అంటున్నాడు. అంతేకాదు అతనికి వైస్ కెప్టెన్గా ఉండాలంటూ మరో ఇద్దరి పేర్లను కూడా సూచించాడు.
వచ్చే రెండు వరల్డ్కప్లకూ రోహితే కెప్టెన్గా ఉండాలి. వాటిలో ఒకటి వచ్చే నెలలో, మరొకటి వచ్చే ఏడాదే జరగబోతున్నాయి. ఇలాంటి దశలో కెప్టెన్లను తరచూ మార్చడం సరికాదు. అందుకే ఈ రెండు టీ20 వరల్డ్కప్లకూ రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉండాలన్నది నా అభిప్రాయం అని గవాస్కర్ స్పష్టం చేశాడు. ఇక వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్, లేదంటే రిషబ్ పంత్ పేర్లను పరిశీలించవచ్చని చెప్పాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను పంత్ నడిపిస్తున్న తీరుపై ప్రశంసలు కురిపించాడు.
అందరూ స్టార్లు ఉన్న ఢిల్లీ టీమ్ను అతడు అద్భుతంగా నడిపిస్తున్నాడు. నోకియా, రబాడాలాంటి బౌలర్లను చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందించే ఇలాంటి కెప్టెన్ ఉండాలి. అందుకే రాహుల్, పంత్లలో ఒకరు వైస్ కెప్టెన్ కావాలి అని గవాస్కర్ చెప్పాడు.