టీమిండియా సారథి అయ్యాక అపజయమనేదే లేకుండా దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. నాయకుడిగా బాధ్యతలు చేపట్టాక అతడు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోలేదు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వస్తున్నాడు. తాజాగా అతడి ఖాతాలో మరో విజయం చేరితే రోహిత్ శర్మ.. ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలుస్తాడు. రెండు మ్యాచులు గెలిస్తే చరిత్రే..
అంతర్జాతీయ క్రికెట్ లో ఓటమనేదే లేకుండా అత్యధిక మ్యాచులు (టెస్టులు, వన్డేలు) గెలిచిన సారథిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు అరుదైన రికార్డు ఉంది. ఆసీస్ సారథిగా అతడు వరుసగా 20 విజయాలు సాధించాడు. 2003-04 సమయంలో పాంటింగ్ ఈ ఘనత అందుకున్నాడు. బ్రెట్ లీ, మెక్ గ్రాత్, ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్, మైకేల్ బెవాన్, షేన్ వార్న్ వంటి దిగ్గజాలు అండగా పాంటింగ్ ఈ ఘనత సాధించాడు. ఓటమనేదే లేకుండా 20 మ్యాచుల్లో నెగ్గాడు.
పాంటింగ్ రికార్డును సమం చేయడానికి రోహిత్ శర్మ ఒక అడుగుదూరంలో నిలిచాడు. సారథిగా హిట్ మ్యాన్ ఇప్పటివరకు (శనివారం ఇంగ్లండ్ తో ముగిసిన టీ20తో కలిపి) 19 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నీ ఇందులో భాగమే.
కాగా నేడు (జులై 10) ఇంగ్లండ్ తో జరుగబోయే ఆఖరి టీ20లో గెలిస్తే రోహిత్.. పాంటింగ్ అత్యధిక విజయాల రికార్డు ను సమం చేస్తాడు. దీంతో పాటు ఈనెల 12న ఇదే ఇంగ్లండ్ తో జరిగే తొలి వన్డేలో కూడా గెలిస్తే పాంటింగ్ రికార్డు బద్దలు కానుంది.
ఓటమనేదే లేక రోహిత్ అత్యధిక విజయాల రికార్డు (19) ఇది..
– టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్ కాకముందు బంగ్లాదేశ్ పై 2 విజయాలు
– టీ20లలో ఫుల్ టైం కెప్టెన్ అయ్యాక న్యూజిలాండ్ తో 3 టీ20లు
– వెస్టిండీస్ తో 3 వన్డేలు, 2 టీ20లు
– శ్రీలంకతో 3 టీ20లు, 2 టెస్టులు
– ఇంగ్లండ్ తో 2 టీ20లలో రోహిత్ కు ఎదురేలేదు.