Rohit Sharma on Kiwi clean sweep | భారత క్రికెట్లో సరికొత్త శకం మొదలైంది. కోచ్గా రాహుల్ ద్రవిడ్, టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ గొప్ప ఆరంభాన్నిచ్చారు. న్యూజిల్యాండ్తో జరిగిన సిరీస్ను క్లీన్ స్వీప్ చేశారు. ఈ క్రమంలో మూడో టీ20 ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. కొత్త జట్టు సభ్యులతో తాము ఏం మాట్లాడిందీ వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్లో ఘోరమైన ప్రదర్శన తర్వాత జట్టును ఎలా గాడిలో పెట్టారని? ఇంత గొప్ప ఫలితం ఎలా సాధించారని అడిగిన ప్రవ్నకు రోహిత్ బదులిచ్చాడు. ప్రస్తుతం తమ ముందున్న ముఖ్యమైన పని జట్టులో భద్రతను కల్పించడమని చెప్పాడు. తొలిసారి జట్టును కలిసినప్పుడే తాను, కోచ్ ద్రావిడ్ ఈ విషయంలో చాలా స్పష్టమైన సందేశం ఇచ్చామన్నాడు.
‘జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. మైదానంలో భయం లేకుండా ఆడే ధైర్యాన్ని, భద్రతను ఆటగాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం’ అని రోహిత్ వివరించాడు. మొట్టమొదటి మీటింగ్లోనే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశామన్నాడు.
‘జట్టు కోసమ మీరేమైనా చేయడానికి ట్రై చేస్తుంటే, ఆ విషయం కచ్చితంగా మా నోటీస్కు వస్తుంది. ఒత్తిడిని పంచుకోవడానికి మీరూ ఒక చెయ్యి వేసి జట్టు కోసం ఏదో చేయడానికి మీరు కూడా ప్రయత్నిస్తున్నారనే అంశానికి తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. వాటిని గుర్తించాల్సిన పని కెప్టెన్, కోచ్లపై ఉంటుంది. ఆటగాళ్లు జట్టు కోసం ఏం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. మీరు మైదానంలో దిగి మీ ఛాన్సులు తీసుకోండి‘ అని ఆటగాళ్లకు చాలా స్పష్టంగా చెప్పినట్లు రోహిత్ తెలిపాడు.