Rohit Sharma : ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టు ముంబై ఇండియన్స్(Mumbai Indians). ఈ మెగా టోర్నీలో విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ(Rohit Sharma) ఒకడు. అయితే అతడి సారథ్యంలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన ముంబై ఈసారి హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు కెప్టెన్సీ అప్పగించడంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అంతేనా.. పాండ్యా రాకతో ముంబై డ్రెస్సింగ్ రూమ్లో మొదలైన ముసలం ఇంకా నడుస్తూనే ఉంది. దానికి తోడూ మూడింటా మూడు మ్యాచుల్లో దారుణ ఓటమి ముంబైని వేధిస్తోంది.
ఈ సమయంలో రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీకి బై బై చెప్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auciton 2025)లో రోహిత్ పాల్గొంటాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన తనను పక్కన పెట్టేసి పాండ్యాకు పగ్గాలు అప్పగించడంతో రోహిత్ గుర్రుగా ఉన్నాడట. ఇక డ్రెస్సింగ్ రూమ్లో జట్టు ఆటగాళ్లు రెండుగా విడిపోయారనే వార్తలు జోరందుకున్నాయి.
ఈ పరిస్థితుల్లో ముంబై ఫ్రాంచైజీతో కొనసాగడం రోహిత్కు నచ్చడం లేదట. దాంతో, అతడు 2025 మెగా వేలంలో తన పేరు రిజిష్టర్ చేసుకొనే ఉద్దేశంతో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. 17వ సీజన్ ముగిస్తే కానీ.. రోహిత్ ఐపీఎల్ భవితవ్యంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
ఐపీఎల్ కెప్టెన్గా హిట్ కొట్టిన ఈ ముంబైకర్.. ఈ ఏడాది టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఎందుకంటే..? రోహిత్ సారథ్యంలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. రెండుసార్లు ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు కంగుతిన్నది. నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023), వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ఫైనల్లో రోహిత్ సేనను ఓడించిన కమిన్స్ బృందం రెండు ఐసీసీ ట్రోఫీలను ఎగరేసుకుపోయింది.