ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్పై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో మూడుసార్లు గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరిన కోహ్లీ.. ఇంతగా ఇబ్బంది పడటం చూడలేదని మాజీ దిగ్గజాలు కూడా చెప్పారు. అయితే వీళ్లందరూ కూడా టీమిండియా ప్రస్తుత సారధి రోహిత్ శర్మ ఫామ్ గురించి మాట్లాడటం లేదని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అన్నాడు.
ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన రోహిత్ ఒక్కసారి కూడా భారీ స్కోరు చేయలేదని అన్నాడు. మొత్తమ్మీద 18.18 సగటుతో కేవలం 200 పరుగులే చేసిన విషయాన్ని ఆకాష్ చోప్రా ప్రస్తావించాడు. ‘‘అందరూ కూడా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ రోహిత్ శర్మ కూడా సరైన ఫామ్లో లేడు. అయితే ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ చివరి మ్యాచులో అర్ధశతకం సాధించాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కూడా చక్కని ఆటతీరు కనబరిచాడు. అందుకే త్వరలోనే అతను ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నా’’ అని ఆకాష్ పేర్కొన్నాడు.