ఇటీవల క్రికెట్ రూల్స్లో కొత్తగా కొన్ని మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ‘మన్కడింగ్’ రూల్ ఒకటి. ఇంతకుముందు దీన్ని క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా భావించేవారు. గతంలో ఐపీఎల్ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ ప్లేయర్ బట్లర్ను ఇలా అవుట్ చేసి పెద్ద దుమారమే రేపాడు.
ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో క్రికెట్ నియమ నిబంధనలు నిర్ణయించే ఎంసీసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. మన్కడింగ్ను రనౌట్ కేటగిరీకి మార్చింది. ఈ నిర్ణయాన్ని పలువురు క్రికెట్ దిగ్గజాలు స్వాగతించారు కూడా.
ఇప్పుడు ఈ జాబితాలో టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ చేరాడు. ‘‘ఈ నిర్ణయం వల్ల బ్యాటర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వారిపై ఒత్తిడి పెంచడానికి ప్రత్యర్థులకు ఇది మంచి అవకాశం’’ అని రోహిత్ అన్నాడు. ఇది మంచి రూల్ అని చెప్పాడు.