టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. సారధిగా తన టర్మ్ను అద్భుతంగా ప్రారంభించాడు. స్వదేశంలో జరిగిన న్యూజిల్యాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీసులను క్లీన్స్వీప్ చేసి ఘనంగా కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఇప్పుడు ఆఫ్ఫీల్డ్లో మరో పనితో వార్తల్లో నిలిచాడు. ఈ 34 ఏళ్ల క్రికెటర్ తాజాగా పర్సనలైజ్డ్ ఇంటీరియర్స్ ఉన్న లంబోర్ఘినీ ఉరుస్ కారు కొనుగోలు చేశాడు. టీమిండియా జెర్సీ రంగులో మెరిసిపోతున్న ఈ కారు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.
ఈ ఉరుస్ కారు కొనుగోలు చేసిన మొదటి క్రికెటర్ రోహితే అని తెలుస్తోంది. రోహిత్ కొత్త కారు ఫొటోలు చూసిన నెటిజన్లు ‘వావ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘లుక్స్ అదుర్స్’ అంటూ మరికొందరు అంటున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్.. స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచులు గెలిచిన సారధిగా ఈ ముంబై క్రికెటర్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం స్వదేశంలో 17 విజయాలతో ఈ జాబితాలో రోహిత్ టాప్లో ఉన్నాడు.
అతని తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, న్యూజిల్యాండ్ సారధి కేన్ విలియమ్సన్ ఉన్నారు. కాగా, వచ్చే శుక్రవారం నుంచి మొదలయ్యే రెండు మ్యాచుల టెస్టు సిరీస్లో శ్రీలంకను ఢీ కొట్టేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ఈ సిరీస్లో తొలిసారి టెస్టు క్రికెట్లో భారత జట్టుకు రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.