Rohit Sharma : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదని అన్నాడు. జట్టులో ఎవరి స్థానం కుడా శాశ్వతం కాదని, మెరుగైన ప్రదర్శన చేసిన వాళ్లకు అవకాశాలు లభించడం పక్కా అని రోహిత్ పేర్కొన్నాడు. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్(Asia Cup)తో పాటు ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘జట్టులో ఎవరి స్థానం శాశ్వతం కాదు. అఖరికి నా ఎంపిక కూడా ఆటోమెటిక్గా జరగదు. నాలుగో స్థానంలో స్థిరంగా రాణించే ప్లేయర్ కోసం చాన్నాళ్లుగా వేట కొనసాగుతోంది. యువరాజ్ సింగ్(Yuvraj Singh) తర్వాత ఆ స్థానంలో నిలకడగా ఆడిన ప్లేయర్ లేడు. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనుకుంటే గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ స్థానంలో అతడి గణాంకాలు చాలా బాగున్నాయి.
యువరాజ్ సింగ్, శ్రేయస్ అయ్యర్
అయితే ఆటగాళ్ల గాయాలు జట్టును దెబ్బతీస్తున్నాయి. గత నాలుగైదేళ్లలో ఆ స్థానంలో చాలా మంది బ్యాటింగ్ చేశారు. జట్టులో ఎవరి స్థానానికి భరోసా లేదు. కేఎల్ రాహుల్(KL Rahul), శ్రేయస్ చాన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే ఆసియా కప్ కోసం జట్టు ఎంపిక జరుగుతుంది. ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి’ అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యంలోని టీమిండియా విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుండగా సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు.