Sanju Samson: టీమిండియాలో అత్యంత దురదృష్టవంతమైన క్రికెటర్ ఎవరంటే కచ్చితంగా గుర్తొచ్చే పేరు సంజూ శాంసన్. ఈ కేరళ కుర్రోడు జట్టులోకి వచ్చి సుమారు దశాబ్దం కావస్తున్నా సంజూ మాత్రం ఇప్పటికీ టీమిండియా రెగ్యురల్ ప్లేయర్ కాలేకపోయాడు. కెప్టెన్లు, కోచ్లు మారినా అతడు ప్లేస్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. వన్డేలలో తన కంటే పేలవ రికార్డు కలిగిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లను ఆడిస్తున్నా సంజూను జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో కూడా అతడిని పట్టించుకోకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సంజూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తనకు ఎప్పుడూ మద్దతుగా ఉంటాడని చెప్పాడు.
ప్రముఖ యూట్యూబర్ ‘ఐయామ్ విత్ ధన్య వర్మ’ షోలో శాంసన్ మాట్లాడుతూ..‘‘నాకు రోహిత్ భాయ్ నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. జట్టులో నాకు చోటు దక్కకపోయినా ఒకవేళ వచ్చినా ఆడే అవకాశం రాకపోయినా నా దగ్గరికి వచ్చే ఫస్ట్, సెకండ్ పర్సన్ అతడే. ఒకసారి నా దగ్గరకు వచ్చి ‘హే సంజూ, నువ్వు ఐపీఎల్లో చాలా బాగా ఆడుతున్నావ్. మరీ ముఖ్యంగా మా ముంబై ఇండియన్స్ మీద ఎక్కువగా సిక్సర్లు కొడుతున్నావ్.. నీ బ్యాటింగ్ బాగుంది’ అని చెబుతాడు..’’ అని అన్నాడు. తనను అందరూ దురదృష్టవంతుడైన క్రికెటర్ అని అంటారని, కానీ తనకు మాత్రం తాను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించానని తెలిపాడు.