టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు కెప్టెన్సీకి అనూహ్యంగా కోహ్లీ వీడ్కోలు పలకడంతో.. అతని స్థానంలో టెస్టుల్లో జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ కెప్టెన్సీ రేసులో రోహిత్ శర్మ పేరు అందరి కన్నా ముందు వినిపిస్తోంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్కు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ముందు రోహిత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్సీ కూడా రోహిత్ చేతికి వచ్చే అవకాశంపై విలేకరులు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన రోహిత్.. తాను ప్రస్తుతం ఆ విషయం గురించి అసలు ఆలోచించడం లేదన్నాడు.
‘ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం పరిమిత ఓవర్ల క్రికెట్ పైనే. వర్క్లోడ్ నిర్వహణ కూడా చాలా ముఖ్యం. ఆటగాళ్లను మారుస్తూ ముందుకెళ్లాలి కాబట్టి కొన్ని సిరీసులు ఓడిపోయే అవకాశం ఉంది. కానీ దానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి టెస్టు కెప్టెన్సీ గురించి మర్చిపొండి. ఇప్పుడు నా దృష్టంతా వెస్టిండీస్, శ్రీలంక సిరీసులపైనే ఉంది’ అని రోహిత్ పేర్కొన్నాడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్ కూడా జరగనున్న నేపథ్యంలో.. ఆ సిరీస్ ముందే టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటిస్తుంది. అప్పుడే టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరో తెలుస్తుంది.