కొత్త బంతితో ఇంగ్లిష్ పేసర్లు నిప్పులు చెరగడంతో.. భారత బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. పుజారా ఓవర్నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకపోగా.. కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత అతడినే అనుసరించాడు. రహానే, పంత్ ఇలా వచ్చి అలా వెళ్లడంతో భారత్ పరాజయం ఖాయమైంది. శుక్రవారం అద్వితీయంగా పోరాడి 80 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన కోహ్లీసేన.. శనివారం 20 ఓవర్లలోనే మిగిలిన ఎనిమిది వికెట్లు చేజార్చుకొని ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది!
లీడ్స్: మేఘావృతమైన వాతావరణంలో ఇంగ్లిష్ పేసర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ టీమ్ఇండియా తొలి సెషన్లోపే ఆలౌటై ప్రత్యర్థికి భారీ విజయాన్ని కట్టబెట్టింది. అద్భుతం జరుగుతుందేమో అని ఏమూలో ఉన్న ఆశలపై ఓలీ రాబిన్సన్ నీళ్లు చల్లాడు. పుజారాతో ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోక పోయినా.. మిడిల్, లోయర్ ఆర్డర్ అండతో లార్డ్స్లో సూపర్ విక్టరీ కొట్టిన కోహ్లీసేన.. మరుసటి మ్యాచ్లోనే చతికిలబడటం గమనార్హం. 354 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా శనివారం నాలుగోరోజు 278 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగులతో విజయ పతాక ఎగురవేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి రోజే మ్యాచ్పై ఆశలు వదులుకున్న టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్లో కాస్త పోరాటం కనబర్చినా.. దాన్ని కొనసాగించడంలో పూర్తిగా విఫలమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్మన్ ఔట్ కాగానే సైకిల్ స్టాండ్ను తలపిస్తూ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు. చతేశ్వర్ పుజారా (91) క్రితం రోజు స్కోరుకే ఔట్ కాగా.. సారథి విరాట్ కోహ్లీ (55) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అజింక్యా రహానే (10), రిషబ్ పంత్ (1) ఘోరంగా విఫలమవగా.. రవీంద్ర జడేజా (25 బంతుల్లో 30; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రాబిన్సన్ 5, ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్లో ప్రారంభం కానుంది.
63 పరుగులకే..
ఓవర్నైట్ స్కోరు 215/2తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్వభావానికి భిన్నంగా దూకుడుగా ఆడుతూ శతకానికి చేరువైన చతేశ్వర్ పుజారా క్రితం రోజు స్కోరుకే రాబిన్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రతీ బంతిని కచ్చితమైన అంచనాతో ఆడిన పుజారా.. రాబిన్సన్ వేసిన కట్టర్ వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు. అంపైర్ ముందు నాటౌట్గా ప్రకటించినా.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించాడు. అప్పటికే విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకోగా.. టెస్టు స్పెషలిస్ట్ అజింక్యా రహానే అతడికి జతవడంతో భారత్కు పెద్దగా ఇబ్బంది లేదనిపించింది. అందుకు తగ్గట్లే అండర్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో తొలి అర్ధసెంచరీ తన పేరిట రాసుకున్నాడు. ఈ దశలో రాబిన్సన్ ఓ అద్భుతమైన బంతితో మ్యాచ్ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. లెంగ్త్ బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. స్లిప్లో రూట్ చేతికి చిక్కాడు. ఈ సిరీస్లో విరాట్ వికెట్ల వెనుక క్యాచ్ ఇవ్వడం ఇది ఐదోసారి. ఇక్కడే భారత్ పరాజయం ఖాయమైపోగా.. రహానే, పంత్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జింక్స్.. అండర్సన్కు వికెట్ సమర్పించుకోగా.. క్రీజు వదిలి ముందు నిల్చున్న పంత్.. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖర్లో జడేజా ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేయగా.. బౌలర్లు లార్డ్స్ పోరాటాన్ని పునరావృతం చేయలేకపోయారు. ఫలితంగా 215/2తో పటిష్ట స్థితిలో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేన మరో 63 పరుగులకే మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది.
తొలి ఇన్నింగ్స్లో 80 పరుగుల లోపు ఆలౌటైన తర్వాత.. ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేస్తే.. ఒత్తిడి అధికంగా ఉంటుంది. శుక్రవారం చక్కగా బ్యాటింగ్ చేసిన మా బ్యాట్స్మెన్.. నాలుగోరోజు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఇంగ్లిష్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో మాపై ఒత్తిడి పెంచి ఫలితం సాధించారు. ఇంగ్లండ్ పిచ్లపై ఆడేటప్పుడు ఏ జైట్టెనా కుప్పకూలడం సహజం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్ల పట్టుదలకు.. స్కోరు బోర్డు ఒత్తిడి తోడవడంతో ఫలితం ప్రతికూలంగా వచ్చింది. ఆరుగురు బ్యాట్స్మెన్ చేయలేని పని అదనపు ఆటగాడు చేస్తాడని అనుకోవడం లేదు. ఈ విజయానికి వారు అర్హులు. ఆస్ట్రేలియాలో 36 పరుగులకు ఆలౌటైన తర్వత కూడా టీమ్ఇండియా చక్కటి పోరాటం కనబర్చిన విషయం మర్చిపోకూడదు. తప్పులను సరిచేసుకొని తదుపరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.
విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్
ఇది సమిష్టి విజయం. జట్టు ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. నాలుగో రోజు ఆరంభంలో వరుసగా మూడు మెయిడిన్లు నమోదైనప్పుడే.. వికెట్లు తీయగలమని భావించా. చివరకు అదే నిజమైంది. అందివచ్చిన అవకాశాలను మా బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. ఓపెనర్లు అందించిన శుభారంభమే జట్టును ఈ స్థితికి చేర్చింది.
జో రూట్, ఇంగ్లండ్ కెప్టెన్
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 78; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 432; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) రాబిన్సన్ 59, రాహుల్ (సి) బెయిర్స్టో (బి) ఓవర్టన్ 8, పుజారా (ఎల్బీ) రాబిన్సన్ 91, కోహ్లీ (సి) రూట్ (బి) రాబిన్సన్ 55, రహానే (సి) బట్లర్ (బి) అండర్సన్ 10, పంత్ (సి) ఓవర్టన్ (బి) రాబిన్సన్ 1, జడేజా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 30, షమీ (బి) అలీ 6, ఇషాంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 2, బుమ్రా (నాటౌట్) 1, సిరాజ్ (సి) బెయిర్స్టో (బి) ఓవర్టన్ 0, ఎక్స్ట్రాలు: 15, మొత్తం: 278. వికెట్ల పతనం: 1-34, 2-116, 3-215, 4-237, 5-239, 6-239, 7-254, 8-257, 9-278, 10-278, బౌలింగ్: అండర్సన్ 26-11-63-1, రాబిన్సన్ 26-6-65-5, ఓవర్టన్ 18.3-6-47-3, కరన్ 9-1-40-0, అలీ 14-1-40-1, రూట్ 6-1-15-0.