ఈ ఏడాది ఐపీఎల్లో తన అతి యాటిడ్యూడ్తో విమర్శలపాలైన ఆటగాడు రియాన్ పరాగ్. ఫీల్డ్లో చురుకుగా కదులుతూ అద్భుతమైన ఫీల్డర్గా పేరు తెచ్చుకున్న ఈ అస్సాం కుర్రాడు.. తన ఓవర్ యాక్టింగ్తో అభాసుపాలయ్యాడు. సీనియర్లపై అసహనం ప్రదర్శించడం.. ఎదుటి వారిని చులకనగా చూడటం అతని ప్రవర్తనలో కనిపించడంతో క్రికెట్ అభిమానులకు అవి రుచించలేదు.
అదే సమయంలో హర్షల్ పటేల్తో అతను పడిన గొడవ కూడా అతనిపై మంచి ఇంప్రెషన్ను దిగజార్చింది. ఈ క్రమంలోనే హర్షల్తో తన గొడవ గురించి తాజాగా పరాగ్ పెదవి విప్పాడు. ఒక గేమింగ్ స్ట్రీమ్లో అక్కడ జరిగింది ఏంటో చెప్పాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పరాగ్ (56 నాటౌట్) రాజస్థాన్ను ఆదుకున్నాడు. బ్యాటర్లంతా విఫలమైనప్పటికీ తను మాత్రం నిలకడగా ఆడి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.
‘‘గతేడాది ఐపీఎల్లో హర్షల్ బౌలింగ్లో నేను అవుటయ్యా. అప్పుడు నన్ను అక్కడి నుంచి వెళ్లిపో అన్నట్లుగా హర్షల్ సైగ చేశాడు. అది నేను మైదానంలో చూడలేదు. ఆ తర్వాత డగౌట్లో చూపించిన రిప్లేలో చూశాను. అప్పటి నుంచి అది నా మనసులో అలా ఉండిపోయింది. ఈ సీజన్లో అతని బౌలింగ్లో సిక్సర్ కొట్టడంతో నేను కూడా అదే విధంగా సైగ చేశాను. ఎవరినీ తిట్టలేదు. వైల్డ్గా రియాక్ట్ అవ్వలేదు. హర్షల్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు’’ అని పరాగ్ చెప్పాడు.
‘‘అయితే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సిరాజ్ నన్ను పిలిచాడు. నువ్వు పిల్లాడివి, పిల్లాడిలా ప్రవర్తించు.. అని నాకు చెప్పాడు. నీతో నేనేం చెప్పదలచుకోలేదు భయ్యా.. అని తనకు సమాధానం చెప్పాను. అప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు అక్కడకు వచ్చేశారు. దాంతో ఆ గొడవ అక్కడితో ముగిసిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత హర్షల్ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అది నాకు చాలా ఇమ్మెచ్యూర్గా అనిపించింది’’ అని పరాగ్ వివరించాడు. అయితే ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, అశ్విన్లపై కూడా పరాగ్ చిరాకు పడి విమర్శలపాలయ్యాడు.