వాండరర్స్ వేదికగా జరిగిన భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా భారత రెండో ఇన్నింగ్సులో పంత్ చాలా నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి అవుటయ్యాడు. దీనిపై మాజీలు భగ్గుమన్నారు. ఈ క్రమంలోనే పంత్ ఆటతీరుపై మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మూడో టెస్టులో పంత్ను పక్కనపెట్టాలని టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు. పంత్ ఎగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తాడని అందరికీ తెలుసు. అతని ఈ బ్యాటింగ్ శైలి వల్లే గత జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించింది. కానీ అదే ఆటతీరు సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఒక్క పరుగు చేయకుండానే అవుటయ్యేలా చేసింది.
ఈ నేపథ్యంలో పంత్ విషయంలో పెదవి విప్పిన మదన్ లాల్.. అతను ఒక మ్యాచ్ విన్నింగ్ ఆటగాడేనని స్పష్టం చేశాడు. అయితే జట్టు కోసం ఆడటానికి, తన కోసం ఆడటానికి మధ్య తేడాను పంత్ అర్థం చేసుకోవాలని సూచించాడు.
‘‘టెస్టు క్రికెట్లో అసలు ఎలా బ్యాటింగ్ చేయాలో పంత్ ఒక నిర్ణయానికి రావాలి. అతని మనుసులో ఏమైనా అనుమానాలుంటే అతనికి విశ్రాంతి ఇవ్వడం మంచిది. అతను మ్యాచ్ విన్నింగ్ ప్లేయరే కానీ అతను జట్టు కోసం ఆడాలి’’ అని చెప్పాడు.
వృద్ధిమాన్ సాహా వంటి సెన్సిబుల్ ఆటగాడు అందుబాటులో ఉన్నాడని, అతనికి అవకాశం ఇచ్చి పంత్కు విశ్రాంతి ఇస్తే చాలా మంచిదని మదన్ లాల్ పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో పంత్తో మాట్లాడతామని, అతని ఆటతీరు మార్చుకోవాల్సిన అవసరం లేదని జొహన్నెస్బర్గ్ ఓటమి తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.