Rishabh Pant | రిషబ్ పంత్.. టీం ఇండియా వికెట్ కీపర్.. అయితేనేం.. మోసగాళ్ల బారిన పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాల రూ.1.63 కోట్లు నష్టపోయాడు. విలాసవంతమైన వాచీలు చౌకధరకు లభిస్తాయని నమ్మబలకడంతో ఆశ పడ్డాడు. కానీ ఈ విలాసవంతమైన వాచీల ఆశతో రూ.1.63 కోట్లు కోల్పోయాడు. రిషబ్ మోసపోయింది కూడా మోసగాళ్లు.. సైబర్ మోసగాళ్ల చేతిలో కాదు.. ఒకనాడు క్రికెటర్ ఉన్న వ్యక్తి చేతిలో మోసానికి గురయ్యాడు. రిషబ్ పంత్ను హర్యానా మాజీ క్రికెటర్ మృణాక్ సింగ్ మోసగించారు. రిషబ్ పంత్ మాదిరిగానే ఒక వ్యాపారిని రూ.6 లక్షల మేర మోసగించినందుకు మృణాక్ సింగ్ ప్రస్తుతం ముంబైలోని అర్టూర్ రోడ్ జైలులో ఉన్నాడు.
గతేడాది జనవరిలో రిషబ్ పంత్ను నమ్మించడానికి మృణాక్ సింగ్ పలువురు క్రికెటర్ల రిఫరెన్స్ ఇచ్చాడు. వారంతా లగ్జరీ గూడ్స్ కొన్నారని విశ్వాసం కల్పించాడు. విలాస వంతమైన వాచీలు, బ్యాగుల, బంగారం ఆభరణాల క్రయ విక్రయాలపై తనకు ఆశ చూపాడని, చౌక ధరకే లభిస్తాయని నమ్మించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రిషబ్ పంత్, అతడి మేనేజర్ పునీత్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫ్రాంక్ ముల్లర్ వాన్గార్డ్ సిరీస్ క్రేజీ కలర్ వాచ్ రూ.36.25 లక్షలకు, రిచర్డ్ మిల్లే వాచ్ రూ.62.60 లక్షలకు కొనుగోలు చేయొచ్చని ఆశ చూపాడు. ముందుగా అడ్వాన్స్ పేమెంట్ చేయాలని చెప్పాడు. తమకు చెల్లని చెక్లు ఇచ్చాడని రిషబ్ పంత్, పునీత్ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.66 లక్షల విలువైన విలాస వస్తువులు, ఆభరణాలను రీ సేల్ కోసం మృణాక్ సింగ్కు ఇచ్చానని రిషబ్ పంత్ తెలిపాడు.
హర్యానా మాజీ క్రికెటర్ మృణాక్ సింగ్ ఇంతకుముందు మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రూ.6 లక్షలకు బిజినెస్ మ్యాన్ను మోసం చేసినందుకు ప్రస్తుతం ముంబై ఆర్టూర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఒక సినిమా డైరెక్టర్ను మోసగించినట్లు విమర్శలు ఉన్నాయి.