Rishabh Pant | టీం ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ త్వరలోడిశ్చార్జ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనికి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రెండు వారాల్లో అతనికి జరిగిన శస్త్ర చికిత్స నయమయ్యేలా కనిపిస్తోంది. దీంతో వైద్యులు రెండు వారాల అనంతరం పంత్ను పరీక్షించి.. డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పట్టొచ్చని తెలిపాయి. సాధారణంగా లిగమెంట్లు నయం కావడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని, ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఉంటుందని చెప్పాయి. ‘సాధారణంగా లిగమెంట్లు నయమవ్వడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. కోలుకునే ప్రక్రియ చాలా క్లిష్టమైందిగా ఇప్పటికే పంత్ గ్రహించారు. అతడు కౌన్సెలింగ్ సెషన్స్ కూడా చేయించుకోవలసి ఉంటుంది. పంత్ మునపటిలా ఆడేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టొచ్చు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
గతేడాది డిసెంబర్30వ తేదీన ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం పంత్ ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.