లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన టీమిండియా క్రికెటర్లు యూకేలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమకు దొరికిన ఈ టైమ్ను హాయిగా గడపడానికి ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్కతో కలిసి ఉండగా.. రోహిత్ శర్మ, అజింక్య రహానే కూడా ఫ్యామిలీస్తో కలిసి యూకేలో సైట్ సీయింగ్కు వెళ్లారు. మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న యూరో 2020 మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. మంగళవారం రాత్రి లండన్లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లాడు.
తన ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి వెళ్లిన పంత్ అక్కడ సెల్ఫీలతో సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్, జర్మనీ మ్యాచ్ చూడటం మంచి అనుభూతిని కలిగించిందంటూ ఈ ఫొటోలు అతడు ట్వీట్ చేశాడు. అది చూసి అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు అభిమానులు. ఏ టీమ్కు సపోర్ట్ చేశావని ఒకరు, మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని మరొకరు అడిగారు. పంత్తోపాటు ఉన్న వాళ్లు ఇంగ్లండ్ జెర్సీలో కనిపించారు. ఈ మ్యాచ్లో ఆ టీమ్ 2-0తో జర్మనీని ఓడించింది.