దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2021( IPL 2021 )లో ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్. ఈ క్రమంలో అతడు లెజెండరీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ను వెనక్కి నెట్టాడు. మంగళవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగులు చేసిన పంత్.. ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్గా మారిన ఈ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు చాన్నాళ్లుగా సెహ్వాగ్ పేరిటే ఉంది. వీరూ ఢిల్లీ తరఫున 85 ఇన్నింగ్స్లో 2382 పరుగులు చేశాడు.
తాజాగా పంత్ ఢిల్లీ తరఫున తన 75వ ఇన్నింగ్స్లో 2390 పరుగుల మార్క్ అందుకొని సెహ్వాగ్ను వెనక్కి నెట్టాడు. పంత్ ఖాతాలో ఒక సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సెహ్వాగ్ ఒక సెంచరీ, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 82 ఇన్నింగ్స్లో 2291 పరుగులు చేశాడు. ఐపీఎల్లో చాలా కాలం పాటు సన్రైజర్స్కు ఆడి కొన్ని సీజన్ల కిందట సొంత టీమ్ ఢిల్లీకి తిరిగొచ్చిన శిఖర్ ధావన్ 1933 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో అతడు టాప్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం అతని దగ్గరే ఉంది.