Rinku Singh : పదహారో సీజన్ ఐపీఎల్(IPL 2023)లో సిక్సర్ల మోత మోగించిన రింకూ సింగ్(Rinku Singh) ఊహించనట్టుగానే టీమిండియా జెర్సీ(Team India Jersey) వేసుకోనున్నాడు. ఆసియా గేమ్స్(Asia Games 2023)లో తన మెరుపు బ్యాటింగ్తో మరోసారి ఫ్యాన్స్ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. భారత జట్టుకు ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన ఈ విధ్వంసక ప్లేయర్ తాజాగా తన తండ్రి ఖాంచంద్ర సింగ్ (Khanchandra Singh) గురించి విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. వాళ్ల నాన్న ఇప్పటికీ ఇంటింటికీ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేస్తున్నాడని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా కూడా వినడం లేదని రింకూ వాపోయాడు.
‘ఇక రెస్ట్ తీసుకోండి అని నాన్నతో అన్నాను. కానీ, ఆయన మాత్రం ఒప్పుకోవడం లేదు. సిలిండర్లు అమ్ముతూనే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ తన జాబ్ను ఇష్టపడుతున్నాడు. చివరకు నేనే నాన్నను అర్ధం చేసుకున్నాను. ఒకవేళ ఇంటి వద్దనే ఉండిపోతే బోర్గా ఫీలవుతాడు. జీవితంలో ఎక్కువ రోజులు పని చేసినవాళ్లను ఒక్కసారిగా ఆ పని నుంచి తప్పుకోవాలని చెప్పడం కొంచెం కష్టమే. ఆ నిర్ణయమేదో వాళ్లే తీసుకోవాలి’ అని రింకూ చెప్పుకొచ్చాడు.
తండ్రి ఖాంచంద్ర సింగ్తో రింకూ సింగ్
క్రికెటర్గా మారేందుకు రింకూ సింగ్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిసిందే. పేదరికం కారణంగా తొమ్మిదో తరగతితోనే చదువుకు ముగింపు పలికాడు. చిన్నా చితకా పనులు చేసుకుంటూ క్రికెటర్ అవ్వాలన్న తన కలను నిజం చేసుకున్నాడు.
అయితే.. తనలా మరెవరూ బాధపడొద్దని అతను యువ క్రికెటర్ల కోసం ఏకంగా ఓ హాస్టల్ కట్టిస్తున్నాడు. గతంలో తాను క్రికెట్ సాధన చేసిన అలీఘర్లోని గ్రౌండ్ పక్కనే ఈ హాస్టల్ నిర్మిస్తున్నాడు. ఇందులో 15 మంది పేద అబ్బాయిలకు అన్ని వసతులు కల్పించడమే కాకుండా తన కోచ్ అమినీతో క్రికెట్లో శిక్షణ ఇప్పించాలని రింకూ భావిస్తున్నాడు.
ఐపీఎల్ 16వ సీజన్తో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు కొట్టి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగించిన రింకూ సిక్సర్ల కింగ్గా పేరొందాడు. ఈ కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బ్యాటర్ 14 మ్యాచుల్లో 474 పరుగులు సాధించాడు. ఫినిషర్గా ఆకట్టుకున్న రింకూను సెలెక్టర్లు ఆసియా గేమ్స్ జట్టుకు ఎంపిక చేశారు. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సారథ్యంలోని భారత జట్టు సెప్టెంబర్లో చైనాకు బయలుదేరనుంది. భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.