Ricky Ponting : ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న భారత ఓపెనర్ కేఎల్ రాహుల్కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మద్దతు పలికాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా రాహుల్ను ఆడించాలని అతను అభిప్రాయపడ్డాడు. అంతేకాదు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో శుభ్మన్ గిల్, రాహ్ల్ ఇద్దరినీ జట్టులోకి తీసుకోవాలని అతను సూచించాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఆరంభించాలని, రాహుల్ను మిడిలార్డర్లో ఆడించాలని పాంటింగ్ తెలిపాడు.
‘రాహల్, గిల్.. ఇద్దరూ తక్కువ టెస్టులు ఆడారు. అయితే.. సత్తా ఉన్న వీళ్లను తుది జట్టులోకి తీసుకోవాలి. డబ్ల్యూటీసీ ఫైనల్లో శుభ్మన్, రోహిత్ ఓపెనింగ్ చేయాలి. రాహుల్ మిడిలార్డర్లో బరిలోకి దిగాలి. ఎందుకంటే.. రాహుల్కు ఇంగ్లండ్ గడ్డ మీద ఆడిన అనుభవం ఉంది’ అని ఈ మాజీ కెప్టెన్ వెల్లడించాడు. తొలి రెండు టెస్టుల్లో రాహుల్ 38 రన్స్ చేసి నిరాశ పరిచాడు. దాంతో, మేనేజ్మెంట్ అతడిని వైస్ కెప్టెన్గా తొలగించింది. ఆఖరి టెస్టులో అతను ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో రాహుల్ను తప్పించి శుభ్మన్ గిల్కు అవకాశం ఇచ్చారు. కానీ, అతను కూడా విఫలం అయ్యాడు. దాంతో, ఆఖరి టెస్టుకు భారత్ జట్టు కూర్పుపై కసరత్తు చేస్తోంది. మూడో టెస్టులో భారత జట్టు దారుణంగా ఓడిపోయింది. నాథన్ లియాన్ 11 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ ఫైనల్లో అడుగుపెట్టేందుకు టీమిండియా మరో మ్యాచ్ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చి 9న అహ్మదాబాద్లో జరగనుంది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇండోర్ టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఆఖరి టెస్టులో నెగ్గితే నేరుగా ఫైనల్ చేరుతుంది.