RCB vs DC | డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ను చేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 169 పరుగుల వద్దే ఆగిపోయింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఈసారి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ మెగ్ లానింగ్ 17 బంతులాడి 11 పరుగులే చేసింది. కానీ మరో ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రం ఆది నుంచే దూకుడుగా ఆడింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్ను శ్రేయాంక పాటిల్ జారవిడిచింది. దీంతో వచ్చిన అవకాశాన్ని షఫాలీ సద్వినియోగం చేసుకుంది. లానింగ్ను డెవిన్.. ఔట్ చేయడంతో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ఐదు ఓవర్లకు 32 పరుగులే చేసిన ఢిల్లీ.. తర్వాత ఆరు ఓవర్లలో 70కి పైగా పరుగులు సాధించింది. అలీస్ క్యాప్సీ (33 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మరిజన్నె కాప్ (16 బంతుల్లో 32, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
ఢిల్లీ నిర్దేశించిన భారీ టార్గెట్ను చేధించేందుకు ఆర్సీబీ బ్యాటర్లు చాలా కష్టపడ్డారు. దూకుడుగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆర్సీబీ.. 8 ఓవర్లు ముగిసేదాకా ఒక్క వికెట్ను కూడా కోల్పోకుండా 75 పరుగులు చేసింది. కానీ 9 ఓవర్లో అరుంధతి రెడ్డి వికెట్ను, 12వ ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధన్నా వికెట్లను కోల్పోవడంతో ఆర్సీబీకి కష్టాలు మొదలయ్యాయి. మేఘన 31 బంతుల్లో 36 పరుగులు చేసినప్పటికీ మిగిలిన బ్యాటర్లు పరుగులు తీయడంలో విఫలమయ్యారు. అదే సమయంలో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోవడంతో ఆర్సీబీ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 169 పరుగుల వద్దే మిగిలిపోయింది. దీంతో 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.