జైపూర్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-19వ సీజన్ ఆరంభానికి సిద్ధమవుతున్న వేళ ఈ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాదిరిగానే మరో ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియ కూడా తుది దశకు చేరినట్టు తెలుస్తున్నది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)లోనూ యాజమాన్య హక్కులు మారనున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ నాలుగు ప్రముఖ కంపెనీలు ఆ ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రాయల్స్ ఫ్రాంచైజీ అమ్మకం విలువ 1.1- 1.35 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 12 వేల కోట్లు) ఉండొచ్చని వ్యాపార వర్గాల అంచనా. ఆర్ఆర్ను దక్కించుకునే రేసులో భారత వ్యాపారరంగ దిగ్గజమైన ఆదిత్య బిర్లా గ్రూప్తో పాటు పలు ఇతర సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఐపీఎల్లో అత్యంత ఆకర్షణ ఉన్న జట్లలో రాజస్థాన్ కూడా ఒకటి. ఈ లీగ్ తొలి సీజన్లో కప్పు గెలిచిన ఆర్ఆర్.. ఆ తర్వాత 17 సీజన్లుగా రెండోసారి విజేతగా నిలువకపోయినా రాజస్థాన్కు అభిమానుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. 2022లో ఫైనల్ చేరిన ఆ జట్టులో సమష్టితత్వం ఎక్కువ. స్టార్లతో సంబంధం లేకుండా విజయాలు సాధించే రాయల్స్ నుంచి ఇటీవలే ఆ జట్టుకు చాలాకాలంగా ఆడుతున్న సంజూ శాంసన్ గుడ్ బై చెప్పినా ఆర్ఆర్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం యాజమాన్యంలో ఎమర్జింగ్ మీడియా ఐపీఎల్ లిమిటెడ్ గ్రూప్ ఓనర్ మనోజ్ బదాలెకు 65 శాతం వాటా ఉంది. రెడ్బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్కు 15 శాతం, లచ్లాన్ ముర్దోచ్కు 13 శాతం వాటా కల్గి ఉన్నారు.
రాజస్థాన్ను దక్కించుకునేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్తో పాటు ప్రముఖ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ (రాబ్ వాల్టన్), భారత మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) అయిన క్యాప్రీ గ్లోబల్ రేసులో ఉన్నట్టు వినికిడి. ఈ సంస్థలు ఇప్పటికే బిడ్లు కూడా దాఖలుచేశాయని వ్యాపారవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. ఇదిలాఉండగా రాజస్థాన్లో యాజమాన్య మార్పులకు సంబంధించి బిడ్లు వచ్చినా ఆ ప్రక్రియ మాత్రం బీసీసీఐ పరిధికి లోబడే జరుగాల్సి ఉంది. దానికోసం ఆర్సీబీ అయినా, రాజస్థాన్ అయినా ఈ ఏడాది అక్టోబర్ దాకా వేచిచూడాల్సిందే. మరి అప్పటివరకూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరం.
ఆర్సీబీ యాజమాన్య మార్పునకు సంబంధించి ఈనెల 31తో గడువు ముగియనుండగా రాజస్థాన్ మాత్రం అమ్మకం విషయంలో తొందరపడటం లేదు. తాము అనుకున్న డీల్ వస్తే (రూ. 12 వేల కోట్లకు పైగా)నే ఫ్రాంచైజీని అమ్మేయాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఓనర్లు ఉన్నట్టు తెలుస్తున్నది. ముందు బిడ్లను ఆహ్వానించి ఆ తర్వాతే అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సమాచారం. దీనిని హైప్రొఫైల్ స్పోర్ట్స్ డీల్ చేసే రైనీ గ్రూప్ పర్యవేక్షిస్తున్నట్టుగా వినికిడి. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్లో చెల్సియా, మాంచెస్టర్ యూనైటైడ్ యాజమాన్య మార్పులు ఈ సంస్థ పర్యవేక్షణలోనే జరిగాయి.