లండన్: ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కొవిడ్ కారణంగా అర్దంతరంగా ఆగిపోయిన సంగతి తెలుసు కదా. ఐదో టెస్ట్ను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ప్రధాన కారణం.. టీమిండియా కోచ్ రవిశాస్త్రితోపాటు ఇతర ప్లేయర్స్ ఓ బుక్ లాంచ్ ఈవెంట్కు వెళ్లడమే. బీసీసీఐ అనుమతి కూడా తీసుకోకుండా ఆ ఈవెంట్కు వెళ్లడంతో రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్లకు కొవిడ్ సోకింది. ఐదో టెస్ట్కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పార్మర్కు కూడా కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ను రద్దు చేశారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్పై కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. మిడ్ డే పత్రికతో మాట్లాడిన శాస్త్రి.. తనను తాను సమర్థించుకున్నాడు. యూకే మొత్తం తెరిచారు. ఎక్కడా ఎలాంటి ఆంక్షలు లేవు. తొలి టెస్ట్ నుంచే ఏదైనా జరిగి ఉండొచ్చు అని రవిశాస్త్రి అన్నాడు. బోర్డు అనుమతి తీసుకోకపోవడంపై ఇప్పటికే బీసీసీఐ రవిశాస్త్రి, కోహ్లిల వివరణ కోరిన విషయం తెలిసిందే. అయితే వరల్డ్కప్కు ముందు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఇంగ్లండ్లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని కూడా ఈ సందర్భంగా రవిశాస్త్రి అన్నాడు. ఈ కొవిడ్ సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో ఏ ఇతర టీమ్ కూడా ఇండియాలాగా ఆడలేదని అభిప్రాయపడ్డాడు.