టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో పదేండ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని అనధికారికంగా తెంచుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15 సీజన్ తర్వాత జడేజా.. తిరిగి చెన్నై ఫ్రాంచైజీతో పూర్తిగా ‘సంబంధాలు’ తెంచుకున్నాడని తెలుస్తున్నది. జడేజా.. 2012 నుంచి సీఎస్కేతో ఆడుతున్నాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మేరకు.. ఐపీఎల్-15 తర్వాత జడేజా మళ్లీ చెన్నైతో టచ్లో లేడు. ఈ సీజన్కు ముందు సీఎస్కేకు సారథిగా నియమితుడైన అతడు.. 8 మ్యాచ్ల తర్వాత వైదొలిగాడు. జడేజాను ఒక ‘విఫల ప్రయోగం’గా చెన్నై యాజమాన్యం చిత్రీకరించింది. ఆ సమయంలోనే మొదలైన విబేధాలతో జడేజా మనస్తాపం చెందాడని అప్పట్నుంచీ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత జడ్డూ.. తన ఇన్స్టాగ్రామ్లో ‘చెన్నైతో ఉన్న జ్ఞాపకాల’ను తుడిపేసుకోవడం (పోస్టులను డిలీట్ చేశాడు)తో వీళ్ల మధ్య విబేధాలు నిజమేనని అభిమానులు నిర్ధారణకు వచ్చారు.
తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్-15లో గాయం కారణంగా చెన్నై ఆడిన చివరి నాలుగు మ్యాచ్లు ఆడకుండానే వెళ్లిన జడేజా.. అప్పట్నుంచి ఇప్పటివరకు ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ ఫ్రాంచైజీతో టచ్లో లేడని సన్నిహిత వర్గాల సమాచారం. తన గాయం ఎలా ఉంది..? అనే విషయాన్ని కూడా జడేజా చెన్నైతో చెప్పలేదట. ఐపీఎల్ ముగిసినప్పట్నుంచి ఆ దూరాన్ని కొనసాగిస్తున్నాడట.
తాజా పరిణామాలు చూస్తుంటే చెన్నై-జడేజా బంధం తెగినట్టే అని తెలుస్తున్నది. వచ్చే సీజన్లో మరో ఫ్రాంచైజీతో జట్టు కట్టేందుకు జడేజా సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు చెన్నై మాత్రం చివరి నిమిషం వరకు ఏదో అద్భుతం జరగకపోదా..? విబేధాలు సమసిపోకపోతాయా..? అని ఆశతో ఉంది. మరి చెన్నై ఆశలు నిజమవుతాయో, జడ్డూ పంతం ఫలిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.