Ravichandran Ashwin | అనూహ్యంగా వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇదే తనకు చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన అశ్విన్.. తాజాగా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో మెగాటోర్నీలో చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు జట్లను ప్రకటించాల్సిన చివరి తేదీ ఈ నెల 28 కాగా.. ఆలోపు అక్షర్ కోలుకోకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ అతడి స్థానంలో 37 ఏండ్ల అశ్విన్ను ఎంపిక చేసింది. స్వదేశీ పిచ్లపై సుదీర్ఘ అనుభవం ఉన్న అశ్విన్ ఈ మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
రెండు వారాలకు ముందు కనీసం వన్డే జట్టు దరిదాపుల్లో కూడా అశ్విన్ పేరు వినిపించకపోగా.. అనూహ్యంగా అతడికి లక్కీ చాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఇదే నా చివరి మెగాటోర్నీ కావొచ్చు. అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఫిక్స్ అయ్యా. జీవితమంటే అంతే. ఊహించనిదే జరుగుతుంది. అసలు నేను ప్రపంచకప్ జట్టులో ఉంటానని కూడా అనుకోలేదు. కానీ అది సాధ్యపడింది. పరిస్థితులే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాయి. జట్టు యాజమాన్యం నాపై నమ్మకం ఉంచింది. వారి విశ్వాసాన్ని వమ్ము చేయను’ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్లో భారత్ తరఫున 10 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 17 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత టీమ్ఇండియాలో విరాట్ కోహ్లీ, అశ్విన్ మాత్రమే 2011 జట్టులో సభ్యులు కాగా.. మిగిలిన వాళ్లంతా తొలిసారి కప్పు ముద్దాడాలనే కసితో ఉన్నవారే!