IND vs AUS | సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చాన్నాళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. సొంతగడ్డపై ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో అశ్విన్ను ఎంపిక చేయాల్సిందనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ అతడిని ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసింది. మెగాటోర్నీకి ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి సిరీస్ ఇదే కాగా.. గాయంతో బాధ పడుతున్న అక్షర్ పటేల్ కోలుకోకపోతే అతడి స్థానంలో సుందర్, అశ్విన్లో ఒకరిని వన్డే వరల్డ్కప్నకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియాకప్ చేజిక్కించుకున్న భారత జట్టు.. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగనుంది. దీని కోసం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. తొలి రెండు వన్డేల నుంచి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. కేఎల్ రాహుల్కు జట్టు పగ్గాలు అప్పగించారు. మూడో మ్యాచ్లో భారత్ పూర్తిస్థాయి బలగంతో బరిలోకి దిగనుంది. దీంతో 15 మందితో కూడిన రెండు జట్లను వేర్వేరుగా ప్రకటించారు. నిరుడు జనవరిలో టీమ్ఇండియా తరఫున చివరి వన్డే ఆడిన అశ్విన్.. జట్టులోకి పునరాగమనం చేయగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ తొలి రెండు మ్యాచ్ల కోసం ప్రకటించిన టీమ్లో చోటు నిలుపుకున్నాడు.
వచ్చే నెల 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవల ఆసియాకప్ ఆడిన జట్టులోని ప్రధాన ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ, పాండ్యా, కుల్దీప్కు తొలి రెండు మ్యాచ్ల నుంచి విశ్రాంతినిచ్చారు. మెగాటోర్నీ కోసం జట్లను ప్రకటించేందుకు ఈ నెల 28 చివరి తేదీ కాగా.. ఆ సమయానికి అక్షర్ కోలుకోకపోతే.. అశ్విన్, సుందర్లో ఒకరిని వన్డే వరల్డ్కప్ జట్టులోకి తీసుకోనున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అక్షర్ కోలుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అగార్కర్ వెల్లడించాడు. ఇక గాయం కారణంగా ఆసియాకప్లో పలు మ్యాచ్లకు దూరమైన శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నాడని.. ఆసీస్తో సిరీస్కు అతడు అందుబాటులో ఉంటాడని అగార్కర్ తెలిపాడు. సిరీస్లో భాగంగా శుక్రవారం మొహాలీలో తొలి మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత ఆదివారం ఇండోర్లో రెండో వన్డే, బుధవారం రాజ్కోట్లో మూడో మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ సిరీస్ అనంతరం భారత్ వరల్డ్కప్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో పాల్గొననుంది. ఇక మెగాటోర్నీలో టీమ్ఇండియా తమ తొలిపోరులో అక్టోబర్ 8న ఆసీస్తోనే అమీతుమీ తేల్చుకోనుంది.
రాహుల్ (కెప్టెన్), జడేజా, రుతురాజ్ గైక్వాడ్, గిల్, శ్రేయస్, సూర్యకుమార్, తిలక్, ఇషాన్, శార్దూల్, సుందర్, అశ్విన్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
రోహిత్ (కెప్టెన్), పాండ్యా, గిల్, కోహ్లీ, శ్రేయస్, సూర్యకుమార్, రాహుల్, ఇషాన్, జడేజా, శార్దూల్, అక్షర్, సుందర్, కుల్దీప్, అశ్విన్, బుమ్రా, షమీ, సిరాజ్.