Ravi Shastri : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు కౌంట్డౌన్ మొదలైంది. మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్లో టెస్టు గద ఫైట్ షురూ కానుంది. మ్యాచ్ జరిగేది ఇంగ్లండ్లో కాబట్టి అందరూ ఆస్ట్రేలియా(Australia)నే ఫేవరెట్ అంటున్నారు. అయితే.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) మాత్రం ఆసీస్ విజయావకాశాల్ని కొట్టి పారేశాడు. ఫైనల్లో టీమిండియా(TeamIndia) గెలుస్తుందని, ఈసారి కచ్చితంగా ట్రోఫీ సాధిస్తుందని అన్నాడు. స్టార్లతో కూడిన భారత జట్టు కచ్చితంగా కప్పు కొడుతుందని చెప్పాడు.
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఫేవరెట్ అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే..? ఆడుతున్నది ఇంగ్లండ్లో కాబట్టి. కానీ, ఫైనల్ మ్యాచ్ ఒకే ఒక టెస్టు. ఫామ్లో ఉన్న భారత ఆటగాళ్లతో ఆసీస్కు కష్టమే. ఫైనల్లో విజయం ఆ జట్టుకు అంత సులువు కాదు’ అని 1983 వరల్డ్ కప్ హీరో రవి శాస్త్రి తెలిపాడు. భారత జట్టుకు కోచ్గా పనిచేసిన అతడికి ఆటగాళ్ల గురించి బాగా తెలుసు. అతని ఆధ్వర్యంలోనే కోహ్లీ సేన ఇంగ్లండ్ పర్యటనలో సంచలనం సృష్టించింది. అంతేకాదు ఐసీసీ 2021లో తొలిసారి నిర్వహించిన టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరింది. 2011లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో వరల్డ్ కప్ నెగ్గింది. ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేదు. భారత జట్టు ఒక ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో గెలిచి ఇప్పటికీ 12 ఏళ్లు కావొస్తుంది.
ఇంగ్లండ్లో సాధన చేస్తున్న ఉమేశ్, సిరాజ్, కోహ్లీ
ఇంగ్లండ్లోని ఓవల్(Oval) స్టేడియం వేదికగా జూన్ 7 -11 తేదీల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. టెస్టు గద కోసం భారత్, ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడనున్నాయి. 2021లో ఫైనల్ చేరిన భారత్ ఆఖరి మెట్టుపై భంగపడింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ప్యాట్ కమిన్స సేనను భారత జట్టు ఓడించింది. దాంతో, ఫైనల్లో కూడా అదే ఫలితం రాబట్టాలని రోహిత్ బృందం భావిస్తోంది. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో భారత స్టార్లు కోహ్లీ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, షమీ, సిరాజ్ మెరుపులు మెరిపించారు. వీళ్లు చెలరేగితే ఫైనల్లో ఆసీస్కు కష్టకాలమే.