Virat Kohl : ఒడిషాలోని బాలాసోర్(Balasore) వద్ద నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohl) సంతాపం తెలిపాడు. పలుకుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటనపై అతను ట్విట్టర్ వేదికగా స్పందించాడు. రైలు ప్రమాదం తనను ఎంతో బాధించిందని అతను అన్నాడు.
ఈ కష్టసమయంలో తన ఆలోచనలు, తన ప్రార్థనలు మృతుల కుటుంబాలకు సంబంధించే ఉంటాయని తెలిపాడు. ‘మూడు రైళ్ల ప్రమాదం గురించి తెలియగానే ఎంతో బాధేసింది. గాయపడ్డ వాళ్లు తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని కోహ్లీ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం విరాట్ జట్టుతో పాటు ఇంగ్లండ్లో ఉన్న విషయం తెలిసిందే.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
— Virat Kohli (@imVkohli) June 3, 2023
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 280కు చేరింది. దాదాపు వెయ్యికి పైగా క్షతగాత్రులయ్యారు. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. దాంతో పెను ప్రమాదం సంభవించింది. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా భద్రతా దళాలు, అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవాళ్లకు ఒడిశా ప్రభుత్వం రూ.2 లక్షలు ప్రకటించింది. దేశ చరిత్రలోనే పెద్ద రైలు ప్రమాదాల్లో ఇదొకటి.
గత ఏడాది ఫామ్ అందుకున్న కోహ్లీ ఐపీఎల్ 16వ సీజన్లో దంచికొట్టాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్తో కలిసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభాలు ఇచ్చాడు. ఆఖరి లీగ్ మ్యాచుల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అయితే.. ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీ సాధించాలనుకున్న అతడి కల కలగానే మిగిలింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోహ్లీ శతకం బాదాడు. కానీ, ఛేజింగ్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టడంతో గుజరాత్ గెలిచింది. దాంతో, ఆర్సీబీ ఇంటిదారి పట్టింది.
ఐపీఎల్ 16వ సీజన్లో సెంచరీ అనంతరం కోహ్లీ అభివాదం
ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7 -11 తేదీల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. 2021లో ఫైనల్ చేరిన భారత్ ఆఖరి మెట్టుపై భంగపడింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది.