న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్లేయర్లను మార్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా.. స్వదేశంలో సత్తాచాటాలని చూస్తున్నది. వచ్చే నెల 6 నుంచి వెస్టిండీస్తో మొదలయ్యే టీ20, వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ బుధవారం జట్లను ఎంపిక చేసింది. అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్న సీనియర్ స్పిన్నర్ అశ్విన్ను పక్కకుపెడుతూ ఐపీఎల్లో అదరగొడుతున్న యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను ఎంపిక చేసింది. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున నిలకడగా రాణిస్తున్న ఈ యువ లెగ్ స్పిన్నర్.. అనతికాలంలోనే జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. విండీస్ సిరీస్లకు బిష్ణోయ్ను జాతీయ జట్టులోకి తీసుకుంది. గాయంతో పాటు ఫామ్లేమితో జట్టుకు దూరమైన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు వన్డే జట్టులో స్థానం దక్కింది. గత కొన్నాళ్లుగా వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న కుల్దీప్ గత సెప్టెంబర్లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. స్వదేశంలో పిచ్లపై కుల్దీప్ ప్రభావం చూపుతాడన్న ఉద్దేశంతో సెలెక్టర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. మరోవైపు సీనియర్ స్పీడ్స్టర్ భువనేశ్వర్ కుమార్ను వన్డేలకు దూరం పెట్టిన సెలెక్టర్లు.. టీ20ల్లోకి తీసుకున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు జట్లకు ఎంపిక కాగా, గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్శర్మ బుధవారం ఫిట్నెస్ పరీక్ష పాసయ్యాడు. సీనియర్ పేసర్లు బుమ్రా, షమీకి విశ్రాంతినివ్వగా.. రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉంటాడు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వెస్టిండీస్తో టీ20 సిరీస్ను అహ్మదాబాద్లో, వన్డేలు కోల్కతాలో జరుగనున్నాయి.