Ranji Trophy: దేశవాళీ క్రికెట్లో అత్యంత పురాతనమైన, ఎంతో ప్రాముఖ్యత కలిగిన రంజీ ట్రోఫీని రద్దు చేయాలంటున్నాడు పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి. ప్రస్తుతం బెంగాల్ రంజీ జట్టు సారథిగా ఉన్న తివారి.. కేరళతో రంజీ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో ట్విటర్ (ఎక్స్) వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వచ్చే సీజన్ నుంచి రంజీ సీజన్ను తొలగించాలని, ఈ టోర్నీలో అనేక తప్పులు జరుగుతున్నాయని అతడు పేర్కొన్నాడు. ఘన చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో లోపాలున్నాయని, ఈ టోర్నీ ప్రాముఖ్యతను క్రమంగా కోల్పోతున్నదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
కేరళతో రంజీ మ్యాచ్ జరుగుతుండగానే నిన్న సాయంత్రం ట్విటర్లో తివారి స్పందిస్తూ… ‘ వచ్చే క్యాలెండర్ ఈయర్ నుంచి రంజీ ట్రోఫీని రద్దు చేయాలి. ఈ టోర్నమెంట్లో అనేక లోపాలున్నాయి. అత్యంత ఘనచరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో కాపాడుకోవడానికి చాలా విషయాలపై దృష్టి సారించాల్సి ఉంది. రంజీ ట్రోఫీ తన ప్రాముఖ్యతను క్రమంగా కోల్పోతుంది. ఇది చూస్తే చాలా ఫ్రస్టేటింగ్గా ఉంది..’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే తివారి ఎందుకిలా కామెంట్స్ చేయాల్సి వచ్చిందనేది మాత్రం స్పష్టత లేదు.
ఇదే విషయమై తివారి తన ఫేస్బుక్ లైవ్లో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బెంగాల్.. కేరళతో మ్యాచ్ను ఔట్డోర్లో ఆడుతోంది. ఈ స్టేడియంలో ఇరు జట్ల డ్రెస్సింగ్ రూమ్లు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో రెండు జట్లూ తమ వ్యూహాలను చర్చించుకోవడానికి కూడా వీలులేకుండా ఉంది. ప్రత్యర్థి టీమ్ వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అవతలి పక్కన ఉన్న డ్రెస్సింగ్ రూమ్లో వినపడుతోంది. అసలిక్కడ గోప్యతే లేదు..’ అని వాపోయాడు.
Ranji trophy should be scrapped off from the calendar from the next season onwards. So many things going wrong in the tournament. So many things need to looked into in order to save this prestigious tournament which has a rich history. It’s losing its charm and importance.…
— MANOJ TIWARY (@tiwarymanoj) February 10, 2024
సుదీర్ఘకాలంగా రంజీలు ఆడుతున్న తివారి.. గతేడాది దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా వారం రోజుల్లోపే యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీ గెలవాలన్న లక్ష్యంతో అతడు బరిలోకి దిగాడు. తివారికి ఇదే ఆఖరి రంజీ సీజన్. అయితే ఫేస్బుక్ లైవ్లో తాను పెట్టిన ట్వీట్ గురించి అభిమానులు వివరణ కోరగా.. ‘ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేను బీసీసీఐ కోడ్ఆఫ్ కండక్ట్కు అనుగుణంగా నడుచుకోవాలి. ఇంతకుమించి ఎక్కువగా ఏమీ మాట్లాడబోను’ అని దాటవేడం గమనార్హం.