సిమ్లా: మహిళతో కలిసి హోటల్లో బస చేసిన వ్యక్తి ఆమెను హత్య చేశాడు. (Man Kills Woman In Hotel) ఆ మహిళ మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి హోటల్ నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. హోటల్ సిబ్బంది అనుమానించడంతో ఆ బ్యాగ్ను ట్యాక్సీలో వదిలి పారిపోయాడు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో ఈ సంఘటన జరిగింది. మే 13న హర్యానాకు చెందిన వినోద్ ఒక మహిళతో కలిసి మనాలీలోని హోటల్ రూమ్లో బస చేశాడు. రెండు రోజుల తర్వాత అతడు ఒంటరిగా రూమ్ ఖాళీ చేశాడు.
కాగా, వినోద్తోపాటు హోటల్లో బస చేసిన మహిళ కనిపించకపోవడం, బరువైన బ్యాగు అతడి వద్ద ఉండటంతో సిబ్బంది అనుమానించారు. పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. ఇది గమనించిన వినోద్ బస్టాండ్కు వెళ్లేందుకు బుక్ చేసుకున్న ట్యాక్సీలో ఆ బ్యాగ్ వదిలి పారిపోయాడు.
మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం ఉంది. మృతురాలిని మధ్యప్రదేశ్కు చెందిన శీతల్గా గుర్తించారు. వినోద్ ఆమె పేరుతో ఆ హోటల్ రూమ్ బుక్ చేసినట్లు తెలుసుకున్నారు. శీతల్ హత్య గురించి ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినోద్ కోసం వెతికిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. శీతల్ను వినోద్ ఎందుకు హత్య చేశాడు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.