Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్లేట్ గ్రూప్లో ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసుకున్న హైదరాబాద్.. తాజాగా ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ బాదడంతో అరుణాచల్ ప్రదేశ్పై ఇన్నింగ్స్ 187 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నాలుగు మ్యాచ్ల్లోనూ రెండు రోజుల్లోనే ఫలితం రావడం కొసమెరుపు.
ఓవర్నైట్ స్కోరు 529/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్.. 615/4 వద్ద డిక్లేర్ చేసింది. తన్మయ్ (181 బంతుల్లో 366; 34 ఫోర్లు, 26 సిక్సర్లు) రికార్డు త్రిశతకం ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ 256 పరుగులకు ఆలౌటైంది. దివ్యాన్ష్ (91) టాప్ స్కోరర్ కాగా.. మన బౌలర్లలో తనయ్, సాయిరామ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తాజా సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ బోనస్ పాయింట్ విజయాలు సాధించింది.