నాగ్పూర్: విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో గెలుపు ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. విదర్భ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఓపెనర్ యశ్ దూబే(94), హర్ష్ గావ్లీ(67) అర్ధసెంచరీలతో రాణించగా, మిగతావారు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సారాంశ్ జైన్(16), కుమార్ కార్తీకేయ(0) క్రీజులో ఉన్నారు.
అక్షయ్ వాఖరే(3-38), ఆదిత్య(2-51) ఎంపీ పతనంలో కీలకమయ్యారు. విజయానికి 93 పరుగుల దూరంలో ఎంపీ.. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 343-6 మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ 402 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ యశ్ రాథోడ్(141) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఎంపీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించాడు. అనుభవ్ అగర్వాల్(5-92) ఐదు వికెట్లతో విజృంభించాడు.