దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ రంజీ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. రంజీ ట్రోఫీ క్వార్టర్స్ లో భాగంగా జార్ఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగాల్ జట్టుకు చెందిన ఏకంగా 9 మంది ఆటగాళ్లు అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ల నుంచి మొదలు తొమ్మిదవ నెంబర్ ఆటగాడి వరకు ప్రతి ఒక్కరూ హాఫ్ సెంచరీ సాధించారు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న జార్ఖండ్-బెంగాల్ మ్యాచ్ లో ఓపెనర్లు అభిషేక్ రమణ్ (61), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (65) తో పాటు 9వ బ్యాటర్ దాకా పరుగులతో హోరెత్తించారు. ఓపెనర్లతో పాటు వన్ డౌన్ లో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామి (186), అనుస్తుప్ మజుందార్ (117), బెంగాల్ యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి (73), అభిషేక్ పురెల్ (68), షాబాజ్ అహ్మద్ (78), సయన్ మండల్ (53), ఆకాశ్ దీప్ (53) లు అర్థ సెంచరీలతో చెలరేగారు.
రెండు సెంచరీలు, ఏడుగురు హాఫ్ సెంచరీల సాయంతో బెంగాల్ జట్టు.. 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు చేసింది. ఫలితంగా దేశవాళీ క్రికెట్ లో 129 ఏండ్ల రికార్డును బెంగాల్ జట్టును బద్దలుకొట్టింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా జట్టు.. ఆక్స్ఫర్డ్-కేంబ్రిడ్బిల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో నమోదైన రికార్డును బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టులోని మొదటి 8 మంది ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు సాధించారు. తాజాగా బెంగాల్ జట్టు లోని 9 మంది బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కడం విశేషం.