బెంగళూరు: టాపార్డర్ రాణించడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ పట్టు బిగించింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దేశవాళీ టైటిల్ చేజిక్కించుకోలేకపోయిన మధ్యప్రదేశ్.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. తొలి ఇన్నింగ్స్లో ముంబై 374 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ 536 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 368/3తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ను రజత్ పాటిదార్ (122; 20 ఫోర్లు) ముందుండి నడిపించాడు.
సారాంశ్ జైన్ (57) అతడికి చక్కటి సహకారం అందించాడు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 5, తుశార్ మూడు వికెట్లు పడగొట్టారు. 162 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 113/2తో నిలిచింది. కెప్టెన్ పృథ్వీ షా (44), హార్దిక్ తమోరె (25) ఔట్ కాగా.. అర్మాన్ జాఫర్ (30), సువెద్ పార్కర్ (9) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ముంబై.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది.