IPL | ఐపీఎల్లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లుగా ప్రశంసలు పొందుతున్న విరాట్ కోహ్లీ, జాస్ బట్లర్ ఒకే మ్యాచ్లో సెంచరీలతో విరుచుకుపడితే రెండు కండ్లు చాలవనుకో. శనివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పోరులో ఇదే జరిగింది. తొలుత రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడుతూ విరాట్ సెంచరీతో విజృంభిస్తే.. రాజస్థాన్ విధ్వంసకారుడు బట్లర్ ఆఖరి బంతికి సిక్స్తో శతకగర్జన చేశాడు. మొత్తంగా రెండు సూపర్ సెంచరీలు నమోదైన మ్యాచ్లో బెంగళూరుపై రాజస్థాన్దే పైచేయి అయ్యింది.
రాజస్థాన్: ఐపీఎల్లో రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. టికెట్ ధరకు రెండింతల మజాను ఫ్యాన్స్ పొందారు. శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై అద్భుత విజయం సాధించింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో రాయల్స్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే..ఆర్సీబీ నాలుగో ఓటమితో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఆర్సీబీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19.1 ఓవర్లలో 189/4 స్కోరు చేసింది. బట్లర్(58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్స్లు)సూపర్ సెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్ శాంసన్(42 బంతుల్లో 69, 8ఫోర్లు, 2 సిక్స్లు) సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. టోప్లె(2/27) రెండు వికెట్లు తీశాడు. తొలుత విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 113 నాటౌట్,12 ఫోర్లు, 4 సిక్స్లు) శతక విజృంభణకు తోడు కెప్టెన్ డుప్లెసిస్(44) ఆకట్టుకోవడంతో బెంగళూరు 20 ఓవర్లలో 183/3 స్కోరు చేసింది. మ్యాక్స్వెల్(1), సౌరవ్ చౌహాన్(9), గ్రీన్(5 నాటౌట్) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. చాహల్(2/34), బర్గర్(1/33) రాణించారు. సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన బట్లర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఆదివారం ఐపీఎల్లో డబుల్ ధమాకా పోరు అభిమానులను అలరించనుంది.
నిర్దేశిత లక్ష్యఛేదనలో రాజస్థాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టోప్లె ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్(0) పరుగులేమి చేయకుండానే నిష్క్రమించాడు. ఈ తరుణంలో క్రీజులోకొచ్చిన శాంసన్, బట్లర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరు పసలేని ఆర్సీబీ బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఆదిలో కొంత నెమ్మదిగా ఆడిన బట్లర్ క్రీజులో కుదురుకున్నాక బ్యాటుకు పనిచెప్పాడు. మరోవైపు మంచి టచ్లో ఉన్న శాంసన్..ఆర్సీబీ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ బౌండరీలతో రాణించాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సరికి రాయల్స్ వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. ఈ క్రమంలో బట్లర్ తొలుత అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, శాంసన్ అతన్ని అనుసరించాడు. ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ డుప్లెసిస్ ఎన్ని ప్రయోగాలు చేసినా లాభం లేకపోయింది. దీనికి తోడు ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్ రాయల్స్కు కలిసొచ్చింది. సిరాజ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన శాంసన్ రెండో వికెట్గా వెనుదిరగడంతో 148 పరుగుల భాగస్వామ్యం బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన పరాగ్(4), జురెల్(2) వెంటవెంటనే ఔటయ్యారు. ఆఖర్లో హెట్మైర్(11 నాటౌట్) జతగా బట్లర్ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ఆఖరి ఓవర్లో విజయానికి ఒక పరుగు అవసరమైన దశలో బట్లర్ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్..బెంగళూరును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. లీగ్లో సూపర్ ఫామ్మీదున్న విరాట్కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్తో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలింగ్ను ఆది నుంచే తమదైన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న ఈ జోడీ స్కోరుబోర్డుకు అలవోకగా పరుగులు జతచేశారు. ముఖ్యంగా కోహ్లీ..బర్గర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే బౌండరీలతో దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు పరుగులు సాధించడంలో పోటీ ప్రదర్శించారు. వీరి దూకుడు ఐదోఓవర్లో అశ్విన్ మూడు పరుగులే ఇచ్చి ఒక రకంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరి కి బెంగళూరు వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసింది. ఓవైపు కట్టుదిట్టమైన బౌలింగ్తో రాజస్థాన్ ప్రయత్నిస్తే..అంతే దీటుగా కోహ్లీ, డుప్లెసిస్ పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. బౌల్ట్ తొమ్మిదో ఓవర్లో డుప్లెసిస్ రెండు సిక్స్లు బాదితే..చాహల్ ఓవర్లో కోహ్లీ సిక్స్ అరుసుకున్నాడు. పరాగ్ 11వ ఓవర్లో డుప్లెసిస్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో 39 బంతుల్లో కోహ్లీ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరిని అడ్డుకునేందుకు స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్ను ప్రయోగించడం రాజస్థాన్కు కలిసొచ్చింది. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో చాహల్ బౌలింగ్లో 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ క్యాచ్ను బర్గర్ జారవిడువగా, డుప్లెసిస్కు మరోమారు లైఫ్ లభించింది. అయితే మరుసటి బంతికే బట్లర్ క్యాచ్తో డుప్లెసిస్ ఔట్ కావడంతో తొలి వికెట్కు 125 పరుగుల భాగసస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మ్యాక్స్వెల్(1), సౌరవ్ చౌహాన్(9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచారు. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..కోహ్లీ కొట్టుడు మాత్రం ఆపలేదు. గ్రీన్(5 నాటౌట్) జతగా కోహ్లీ ఐపీఎల్ కెరీర్లో ఎనిమిదో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
బెంగళూరు: 20 ఓవర్లలో 183/3(కోహ్లీ 113 నాటౌట్, డుప్లెసిస్ 44, చాహల్ 2/34, బర్గర్ 1/33),
రాజస్థాన్: 19.1 ఓవర్లలో189/4 (బట్లర్ 100 నాటౌట్, శాంసన్ 69, టోప్లె 2/27, సిరాజ్ 1/35)