అంచనాల్లేకుండా సీజన్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తున్నది! గత రెండు మ్యాచ్ల్లో పరాజయాలు చవిచూసిన రాజస్థాన్.. పంజాబ్పై మూకుమ్మడి దాడి చేసింది. మొదట బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్ రాణించి కింగ్స్ను మరింత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేస్తే.. ఆనక బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ విలువైన ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. తాజా సీజన్లో లక్ష్యఛేదనలో రాజస్థాన్కు ఇదే తొలి విజయం కాగా.. ఒక విజయం తర్వాత తదుపరి మ్యాచ్లో ఓటమి పాలయ్యే పరంపరను పంజాబ్ కొనసాగించింది!!
ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ అద్వితీయ విజయాన్నందుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. గత రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన రాయల్స్ సమిష్టిగా సత్తాచాటింది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఏడింట నెగ్గిన రాజస్థాన్ 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్స్టో (40 బంతుల్లో 56; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. జితేశ్ శర్మ (18 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), భానుక రాజపక్స (27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు.
రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించగా.. జోస్ బట్లర్ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, ఒక సిక్సర్), పడిక్కల్ (31), హెట్మైర్ (16 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్శ్దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టా డు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కిం ది. ఆదివారం జరుగనున్న మ్యాచ్ల్లో బెంగళూరుతో హైదరాబాద్.. చెన్నైతో ఢిల్లీ తలపడనున్నాయి.
పంజాబ్: 20 ఓవర్లలో 189/5 (బెయిర్స్టో 56, జితేశ్ 38 నాటౌట్; చాహల్ 3/28), రాజస్థాన్: 19.4 ఓవర్లలో 190/4 (జైస్వాల్ 68, హెట్మైర్ 31 నాటౌట్; అర్శ్దీప్ 2/29).