సెంచూరియన్: పరుగుల వరద పారిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఇది లైవా.. లేక హైలెట్సా అని ఆశ్చర్యపోయేలా సాగిన పోరులో ఇరు జట్లు కలిపి 517 పరుగులు చేయడం విశేషం.
మొదట బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (46 బంతుల్లో 118; 10 ఫోర్లు, 11 సిక్సర్లు) అద్వితీయ శతకం నమోదు చేసుకోగా.. కైల్ మేయర్స్ (27 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు.
ఆఖర్లో పావెల్ (28), షెఫర్డ్ (41 నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్సర్లు) కూడా బ్యాట్కు పనిచెప్పడంతో విండీస్ భారీ స్కోరు చేసింది. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 3, వైన్ పార్నెల్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. టీ20 క్రికెట్లో ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కావడం గమనార్హం. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలిలా విరుచుకుపడగా.. రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచూరియన్లో సునామీ సృష్టించాడు. డికాక్కు అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.