టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి మాదిరిగానే ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 14 మ్యాచులలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని రోహిత్ శర్మను కచ్చితంగా ప్రశ్నించాల్సిందేనని.. అసలు అతడికి సఫారీ సిరీస్ లో రెస్ట్ ఎందుకిచ్చారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు.
రోహిత్ ఫామ్, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ లో అతడికి విరామమివ్వడం గురించి కపిల్ ను ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. ‘ఈరోజుల్లో ఎవరికి రెస్ట్ ఇస్తున్నారో.. ఎందుకిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. సెలక్టర్లకు మాత్రమే దీని గురించి అవగాహన ఉండి ఉండాలి. రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాడు. అందులో ఎటువంటి సందేహమూ లేదు.
అయితే మీరు గ్యారీ సోబర్స్, డాన్ బ్రాడ్మన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సునీల్ గవాస్కర్, వివ్ రిచర్డ్స్ అయినా మాకు సంబంధం లేదు. 14 మ్యాచులలో అర్థ శతకం చేయకుంటే ప్రజలు మిమ్మల్ని కచ్చితంగా ప్రశ్నిస్తారు..’ అని నిలదీశాడు.
రోహిత్ కు విరామమివ్వడం గురించి అతడే సమాధానం చెప్పాలని కపిల్ తెలిపాడు. ‘ఈ ప్రశ్నకు అతడే సమాధానం చెప్పాలి. మరి అతడు తీరిక లేని క్రికెట్ ఆడుతున్నాడా..? లేక ఆడి ఆడి ఆటను ఆస్వాదించడం మరిచిపోయాడా..?’ అని ప్రశ్నించాడు. విరాట్, రోహిత్ వంటి ఆటగాళ్లు ఆటను ఆస్వాదించాలని లేకుంటే వాళ్లు పేరు, ప్రఖ్యాతలను బట్టి జట్టులో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని కపిల్ హెచ్చరించాడు.
ఐపీఎల్-15 లో రోహిత్ శర్మ 14 మ్యాచులాడి 19.14 సగటుతో 268 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్థ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్ కంటే ముందు లంకతో మూడు టీ20 లు, విండీస్ తో మూడు మ్యాచులలో కూడా రోహిత్ హాఫ్ సెంచరీ చేయలేదు. గతేడాది నవంబర్ లో పొట్టి ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో రోహిత్.. చివరి రెండు మ్యాచులలో రెండు ఫిఫ్టీలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ బ్యాట్ పైకెత్తింది లేదు.