IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్లో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దాంతో, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అయితే.. గత రికార్డులు ఏం చెప్తున్నాయంటే.. క్వాలిఫైయర్ 1లో గెలిచి మొదట ఫైనల్కు దూసుకెళ్లిన జట్టే అత్యధికంగా 9 సార్లు కప్పు కొట్టింది. 2011 నుంచి ఇప్పటివరకు 9 సార్లు క్వాలిఫైయర్ 1 విజేతనే ట్రోఫీని సొంతం చేసుకుంది. కేవలం మూడు సార్లు మాత్రమే క్వాలిఫైయర్2 టీమ్ చాంపియన్గా నిలిచింది.
అలాగని ఈ సీజన్లో ధోనీ సేన గెలుస్తుందని చెప్పలేం. ఎందుకంటే..? క్వాలిఫైయర్ 1 పోరులో అనూహ్యంగా సీఎస్కే చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో పంజా విసిరింది. చాంపియన్ ఆటతో బలమైన ముంబై ఇండియన్స్ను 62 రన్స్తో చిత్తు చేసింది. సొంతగడ్డపై గుజరాత్ అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ, మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన తెలివైన వ్యూహాలతో మ్యాచ్ను చెన్నై వైపు తిప్పగల దిట్ట. దాంతో, విజేతగా నిలిచేది ఎవరో ఫస్ట్ ఇన్నింగ్స్తో దాదాపు తెలుస్తుంది.
ఐపీఎల్ 2023 ట్రోఫీతో హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ 15వ సీజన్(2022) – క్వాలిఫైయర్ 1లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఆరంగేట్రం సీజన్లోనే చాంపియన్గా నిలచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది.
ఐపీఎల్ 2021 – చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది.
2020 – ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ముంబై ఇండియన్స్ ఐదోసారు ట్రోఫీని ముద్దాడింది.
2019 – ముంబై ఇండియన్స్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది.
2018 – చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది.
2017 – ముంబై ఇండియన్స్ ఫైనల్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్పై గెలిచి ట్రోఫీ అందుకుంది.
2016 – డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి కప్పు కొట్టింది. ఫైనల్లో కోహ్లీసేన ఓటమి పాలైంది.
ఐపీఎల్ 2016 ట్రోఫీతో హైదరాబాద్ ఆటగాళ్ల సంబురం
2015 – ఫైనల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.
2014 – కోల్కతా నైట్ రైడర్స్ తొలిసారి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ముంబై ఇండియన్స్పై గెలుపొందింది.
2013 – ఫైనల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.
2012 – కోల్కతా నైట్ రైడర్స్ తొలిసారి చాంపియన్గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.
2011 – ఆర్సీబీ కప్పు ఆశలను చెన్నై సూపర్ కింగ్స్ కల్లలు చేసింది.
క్వాలిఫైయర్ 1లో చెన్నై 15 రన్స్ తేడాతో గుజరాత్ను చిత్తు చేసింది. ఈ సీజన్లో తొలిసారి హార్దిక్ పాండ్యా సేనను ఓడించింది. క్వాలిఫైయర్ 2 పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ముంబైపై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లు) ముంబైని ముంచాడు. అతడు సెంచరీ బాదడంతో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 233 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్(55) ఒక్కడే పోరాడాడు. అయితే.. సీనియర్ పేసర్ మోహిత్ శర్మ 5 వికెట్లు తీయడంతో ముంబై 171కు ఆలౌటయ్యింది. ఫైనల్లో చెన్నైతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. క్వాలిఫైయర్ 1 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే.. బౌలర్లను సమర్థంగా ఉపయోగించుకొనే ధోనీ చెన్నైని గెలిపించేందుకు శాయశక్తులా పోరాడతాడు.